తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
భూ సేకరణ జీవో 80ఏ రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ హన్మకొండ జిల్లా అరెపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపేందుకు మల్లన్న వెళ్లారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట మధ్య మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా తమ ఆందోళనలు ఆగవని అన్నారు. మల్లన్న అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత రైతులకు అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న తెలిపారు. 80ఏ జీవోను రద్దు చేసేంత వరకు రైతులంతా ఐకమత్యంతో పోరాడాలని సూచించారు.
రైతులకు మల్లన్న మద్దతు తెలుపుతున్నారు. బీజేపీలో చేరిన మల్లన్న.. తర్వాత సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా కథనాలు చెప్పేవారు. దీంతో ఆయనను ఇదివరకే అరెస్ట్ చేయగా.. విడుదల అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత క్యూ న్యూస్ చానెల్ పేరుతో జనాలకు దగ్గర అయ్యాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉదయమే వార్తలు చదివేవాడు. దీంతో ప్రభుత్వం కూడా అతనిపై ఓ కన్నేసి ఉంచింది. సమయం దొరికితే చాలు.. అతనిపై చర్యలకు ఉపక్రమించేది. రకరకాల కేసులను ఫైల్ చేసేది.
ఇవాళ కూడా రైతులకు మద్దతుగా నిలువగా.. అరెస్ట్ చేసింది. మల్లన్న మాత్రం రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతానని చెబుతున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని అంటున్నారు.