క్లాస్ రూమ్లో పాఠాలు విన్న కలెక్టర్: వంటశాల, భోజనశాల పరిశీలన, చర్యలే..
ఐఏఎస్.. అంటే నిత్యం బిజీ, పని ఒత్తిడి.. జిల్లా పాలనలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు కూడా పర్యవేక్షించడం వారి పనే.. దానిని ఓరుగల్లు కలెక్టర్ గోపీ చేశారు. అంతకుముందు తరగతి గదిలో టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారో కూడా నేరుగా పరిశీలించారు. అయితే దీనికి కారణం కూడా ఉంది. ఇదివరకు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతో పరిశీలిస్తున్నారు. ఆహారంతోపాటు.. క్లాసులు చెప్పే విధానాన్ని కూడా అబ్జర్వ్ చేశారు.
ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్
నర్సంపేట ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ గోపి పరిశీలించారు. జూనియర్ కాలేజీని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలోనే టీచర్ల బోధనను స్వయంగా పరిశీలించారు. వసతి గృహాల్లో వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వంటశాల, వంట సామాగ్రి పరిశుభ్రంగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ విషయం..
వర్ధన్నపేటలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడ్డ ఆహారం పిల్లలకు వడ్డించడంతో సమస్య వచ్చింది. పిల్లలు వాంతులు చేసుకోగా.. మరికొందరు కడుపునొప్పితో అల్లాడారు. విద్యార్థులకు చికిత్సను అందజేశారు. అన్నంలో బల్లి కనిపించగా.. విద్యార్థి హాస్టల్ సిబ్బందికి తెలియజేసింది. ఏం కాదులే అని హాస్టల్ సిబ్బంది పట్టించుకోలేదు. బల్లి కనపిస్తే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు. భోజనం వడ్డించడంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
సీరియస్గా తీసుకున్న కలెక్టర్
ఘటనను కలెక్టర్ గోపి సీరియస్గా తీసుకున్నారు. వార్డెన్ జ్యోతిపై చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో సదుపాయాలపై ఫోకస్ చేశారు. సమస్యలను తెలుసుకునేందుకు.. పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దని కాస్త గట్టిగానే చెబుతున్నారు.