ట్రై వ్యాలీ గురించి తెలిసే చేరారా?
భూతల స్వర్గం అమెరికాలో అడుగు పెట్టడానికి విద్యార్థులు రెడ్ ఫ్లాగ్లను పట్టించుకోకుండా ప్రశ్నార్థకమైన అకడమిక్ మార్గాన్ని ఎంచుకున్నారు. విశ్వవిద్యాలయం కుంభకోణాన్ని అమెరికా అధికారులు బయటపెట్టడంతో దాదాపు 1500 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమెరికాకు వివిధ దేశాల నుంచి చదువు కోసం ఏడాదికి పది వేల నుంచి 15 వేల మంది దాకా వస్తున్నారు. అయితే, చాలా మంది టాప్ 50 స్కూళ్లలో చేరడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. వివిధ పరీక్షల ద్వారా విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలో పలు మోసపూరిత విద్యాలయాలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. జిఆర్ఇ వంటి పరీక్షలు ఏవీ రాయని విద్యార్థులను కూడా చేర్చుకోవడానికి సిద్దపడుతున్నాయి. అందుకు వేలాది డాలర్లు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి.
ట్రైవ్యాలీ వంటి విశ్వవిద్యాలయాలు ఒపిటి, సిపిటి సౌకర్యాలను ఇతర విశ్వవిద్యాలయాలకు భిన్నంగా మొదటి రోజు నుంచే కల్పిస్తున్నాయి. దాని వల్ల విద్యార్థుల పేరుతో అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెంటనే అవకాశాలను కల్పిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరడానికి ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయాల్లో బోధనా సౌకర్యాలు, భవన సదుపాయాలు కూడా సరిగా లేవని వార్తలు వస్తున్నాయి. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం చైనీస్ క్రిస్టియన్స్ ప్రధానంగా నడుపుతున్నారు. ఫ్యాకల్టీలో కొద్ది మంది భారతీయులు కూడా ఉన్నారు. సుసాన్ జియో - పింగ్ షూ ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం తన ప్రకటనల జోరుతో విద్యార్థులను ఆకర్షించడానికి ముందుకు వచ్చిన తరుణంలో ట్రైవ్యాలీ అక్రిడేటెడ్ విశ్వవిద్యాలయం కాది, దాని నుంచి డిగ్రీ పొందలేరని, ఆ విశ్వవిద్యాలయం ఇచ్చే డిగ్రీకి విలువ లేదని ఓ ఫోరం 2010 మే 19వ తేదీన హెచ్చరించింది కూడా.
ఈ స్థితిలో భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో ఎక్కువ మంది తెలుగువారే కావడంతో అమెరికాలోని ఆటా వంటి తెలుగు సంస్థలు సహాయం అందించడానికి ముందుకు వచ్చాయి. రాజ్ ఆకులకు చెందిన ఆకుల అండ్ అసోయేట్స్ ఇప్పటి వరకు 600 మంది విద్యార్థులను సంప్రదించింది. వారికి తగిన సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.