CSKలో కీలక మార్పు..! ఆయుష్ మాత్రే స్ధానంలో ముంబై మాజీ పేసర్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టోర్నీ ప్రారంభానికి ముందే పేసర్ నాథన్ ఎల్లిస్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో స్పెన్సర్ జాన్సన్ను తీసుకున్నారు. వెటరన్ కీపర్ కమ్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా ఇప్పటివరకూ బరిలోకి దిగలేదు. ఎడమచేతి వాటం పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా జట్టుకు దూరమయ్యాడు. వీటన్నింటి కంటే మించి పామ్ లో ఉన్న బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో తాజాగా జట్టుకు దూరమయ్యాడు. ఆరు మ్యాచ్లలో 177.88 స్ట్రైక్ రేట్తో 201 పరుగులు చేసిన మాత్రే దూరం కావడం భారీ షాక్.
దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఆయుష్ మాత్రే స్ధానంలో మరో బ్యాటర్ ను వెతుకుతున్న సీఎస్కేకు .. ఓ మాజీ పేసర్ దొరికాడు.
ముంబై ఇండియన్స్ మాజీ స్టార్ ఆకాష్ మధ్వాల్ను జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే నిర్ణయించింది. ఆయుష్ మాత్రే స్ధానంలో మధ్వాల్ తో ఒప్పందం చేసుకుంది. రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మధ్వాల్ గతంలో ముంబై ఇండియన్స్ (2023, 2024) , రాజస్థాన్ రాయల్స్ (2025) జట్లకు ప్రాతినిధ్యం వహించాడని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్లలో ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ముంబై ఇండియన్స్ తరఫున తన తొలి సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్లో 5 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి సంచలనాత్మక గణాంకాలను నమోదు చేశాడు. దీంతో మధ్వాల్ ను కేవలం రూ.30 లక్షల ఫీజుతో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో మధ్వాల్ ను ఆడించే అవకాశం ఉంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఇబ్బందులు పడుతున్న సీఎస్కేకు మధ్వాల్ ఏ మేరకు ఉపయోగపడతాడో చూడాలి.














Click it and Unblock the Notifications