లార్డ్స్ టెస్టు బాయ్ కాట్ కు పాక్ విఫలయత్నం..? ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూ చిచ్చు..!
ఇంగ్లండ్ తో లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ను బాయ్ కాట్ చేసేందుకు పాకిస్తాన్ జట్టు (Pakistan Team) సిద్దమైంది. నిన్న లంచ్ బ్రేక్ కు వెళ్లిన పాకిస్తాన్ క్రికెటర్లకు వాళ్ల క్రికెట్ బోర్డు పీసీబీ (PCB) నుంచి ఓ సందేశం వచ్చింది. దీంతో వారు దాదాపుగా ఈ మ్యాచ్ ను మధ్యలోనే బాయ్ కాట్ చేసేందుకు సిద్దమయ్యారు. దీనికి కారణం ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆయన గురించి స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూనే. ఇందులో వారు వెల్లడించిన అంశాలు వివాదాస్పదం అవుతాయనే భయమే పాక్ జట్టును ఇలా మ్యాచ్ బాయ్ కాట్ వరకూ వెళ్లేలా చేసింది.
ఇంగ్లాండ్- పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ సిరీస్ ను స్కై స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే ఇందులోనే ఇమ్రాన్ ఖాన్ కుమారులతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో ఇమ్రాన్ కుమారులు కాశిం ఖాన్, సులేమాన్ ఈసా ఖాన్ ఇద్దరూ తమ తండ్రికి సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రికెట్ కు, దేశానికి తమ తండ్రి చేసిన సేవల్ని మరిచి ప్రభుత్వం కక్షసాధిస్తోందని వారు ఆరోపించారు. దీంతో 18 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూ వ్యవహారం పీసీబీకి చేరింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పీసీబీ అధికారులు.. స్కై స్పోర్ట్స్ సిబ్బందికి కాల్ చేశారు.

ఆ ఇంటర్వ్యూ ఎట్టి పరిస్ధితుల్లోనూ స్కై స్పోర్ట్స్ లో ప్రసారం కాకూడదని, అలా జరిగితే ఇంగ్లండ్ తో ప్రస్తుతం లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టును బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికల్ని లెక్కచేయకుండా స్కై స్పోర్ట్స్ దీన్ని ప్రసారం చేసేసింది. దీంతో చేసేది లేక పాకిస్తాన్ క్రికెటర్లు ఉసురూమంటూ మైదానంలోకి వెళ్లాల్సి వచ్చింది. స్కైస్పోర్ట్స్ తో పీసీబీ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో పాక్ క్రికెటర్లకు మైదానంలోకి వెళ్లొద్దంటూ సందేశం వచ్చింది. కానీ ఈ ఇంటర్వ్యూ కొంత ఆలస్యంగా ప్రసారం అయిపోవడంతో చేసేది లేక పాక్ క్రికెటర్లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు.














Click it and Unblock the Notifications