జగన్ కేసులా నీకిది.. నాకది: ఉచ్చులో దాసరి
బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసింది. గతంలో నమోదు చేసిన కేసులలో దాసరి పేరు లేదు. తాజా కేసులో మాత్రం ఆయన పేరు ఉంది. తప్పుడు సమాచారంతో గనులు పొందిన సంస్థలు ప్రతిఫలంగా ముడుపులు ముట్టజెప్పినట్లుగా ఆధారాలు లభించాయని తెలుస్తోంది. వీటి ఆధారంగానే తాజాగా కేసు నమోదు చేశారని, దీనిని బట్టి చూస్తే దాసరికి చిక్కులు తప్పకపోవచ్చునని అంటున్నారు.
కేసులు ఎవరెవరి పైనా.. ఏమేం కేసులు..
దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, సౌభాగ్య మీడియా, జిందాల్కు చెందిన నాలుగు కంపెనీలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 120బి రెడ్ విత్ ఐపిసి సెక్షన్ 420, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(డి) కింద కేసు నమోదయింది. ఢిల్లీ, హైదరాబాదు తదితర నగరాల్లో సోదాలు నిర్వహించారు. బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఢిల్లీలోని రెండు ఉక్కు పరిశ్రమలు వాస్తవాలను వక్రీకరించాయని, వాటికి బ్లాకులను కేటాయించినందుకు ప్రతిఫలంగా దాసరి నేతృత్వంలోని సౌభాగ్య మీడియాలోకి రూ.2.25 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
నీకిది.. నాకది కింద చేతులు మారిన డబ్బులు
దాసరికి సంబంధించిన కంపెనీలోకి జిందాల్కు చెందిన కంపెనీ నుంచి రూ.2.25 కోట్ల నిధులు ఎలా తరలిందీ సిబిఐ గుర్తించింది. సిబిఐ సేకరించిన వివరాల ప్రకారం.. బొగ్గు వ్యాపార రంగంలో గనుల కేటాయింపుల ద్వారా అతి పెద్ద లబ్ధిదారుగా నవీన్ జిందాల్ అవతరించారు. ఆయన కంపెనీకు 7 కేటాయింపులు జరగగా.. అందులో 5 దాసరి హయాంలోనే జరిగాయి. దీనికి ప్రతిఫలంగా తన కంపెనీ ద్వారా రూ.2.25 కోట్లను రుణంగా దాసరికి చెందినదిగా భావిస్తున్న కంపెనీకి సమర్పించారు.
జగన్ కేసులాగే..!
జగన్ కేసులాగే 'నీకది నాకిది' అనే తంతులో సాగినట్లుగా కనిపిస్తోంది. న్యూఢిల్లీ ఎక్జిమ్ అనే బినామీ ట్రేడింగ్ కంపెనీకి జిందాల్ అంతకుముందు డైరెక్టర్లుగా పని చేసిన డ్యూస్ ప్రాపర్టీస్ నుంచి రూ.2.25 కోట్ల పూచీకత్తు లేని రుణం రూపంలో నిధులు తరలించారు. తరలింపు సమయంల డ్యూస్లో జిందాల్ అనుచరులే డైరెక్టర్లుగా ఉన్నారు. డ్యూస్ కంపెనీయే జిందాల్ రియాల్టీగా అవతరించింది. 2008 డిసెంబరులో న్యూఢిల్లీ ఎక్జిమ్ సంస్థ... లిస్టెడ్ కంపెనీ అయిన సౌభాగ్య మీడియా షేర్లను ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కొనుగోలు చేసింది. సౌభాగ్య మీడియా సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ సినిమాలు నిర్మించడంతో పాటు టివి కార్యక్రమాలను రూపందించేది.
ఈ సౌభాగ్య మీడియాలోనే దాసరికి చెందిన సిరి మీడియాకు 59.6 శాతం వాటా ఉంది. అంటే దాసరి ప్రధాన వాటాదారుగా ఉన్న సిరి మీడియా ఆధ్వర్యంలోనే ఇది పని చేసేది. అంతేకాకుండా ముంబై ఎక్సైంజిలో ట్రేడవుతున్న ధర కంటే నాలుగు రెట్లు అధికంగా వెచ్చించి సౌభాగ్య షేర్లను న్యూఢిల్లీ ఎగ్జిమ్ కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.112.50ను చెల్లించింది. ఆ తర్వాత 2011లో షేర్లను అమ్మేసిన ఎగ్జిమ్కు కేవలం రూ.20.2 లక్షలే వచ్చాయి. 2012 మార్చిలో తన రుణాలను చెల్లించినట్లుగా ప్రకటించింది.