నవ్యాంధ్ర అసెంబ్లీ: 'ఫిరాయింపుల' మకిలీ అంటిస్తారా?
హైదరాబాద్/ అమరావతి: ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం.. అమరజీవి పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష ఫలితంగా కర్నూల్ కేంద్రంగా 'ఆంద్ర'.. నాటి హైదరాబాద్ రాష్ట్రం విలీనంతో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ పట్ల సాచివేత ధోరణిపై ఉద్యమం.. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. రెండున్నరేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఆవిర్భావం.. రెండు రాష్ట్రాలుగా తెలుగు నేల విడిపోయింది.
13 జిల్లాలకు కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా 'అమరావతి' సర్వాంగ సుందరంగా అవతరించింది. రెండున్నరేళ్ల అహర్నిశల క్రుషి ఫలితంగా అధునాతన అసెంబ్లీ.. సచివాలయం కూడా ఏర్పాటయ్యాయి. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నవ్య అంకానికి శ్రీకారం చుట్టనున్నారు.
2017 - 18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నూతన శాసనసభలోనే ప్రారంభం కానున్నాయి. దీనికి సంకేతంగా ఇటీవలే నూతన అసెంబ్లీని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, తదితరులు ప్రారంభించారు.
కొత్త రాజధానిలోనూ...
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు పదేళ్ల పాటు హైదరాబాద్ నగరాన్నే రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో స్పష్టంగా చేర్చినా ఆగమేఘాల మీద రాజధాని అమరావతి పేరిట కొత్త నగర నిర్మాణానికి పూనుకోవడమే కాదు నిర్దేశిత సమయంలోపే పూర్తి చేసుకుని పూర్తిస్థాయి పాలనకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో రాజకీయ క్రీడకు తెర తీయడమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నతరుణంలో మంచీ చెడులూ నైతిక విలువలు, ప్రమాణాలూ ప్రస్తావనార్హమని విశ్లేషకులు చెప్తున్నారు.
అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలివే..
ఈ పరిస్థితుల్లో సోమవారం నుంచి అత్యాధునిక సాంకేతిక హంగులు సంతరించుకున్ననూతన అసెంబ్లీ భవనంలో తొలిసారి జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులను ప్రలోభ పెట్టి టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు. వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఫిర్యాదు చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. అఫ్కోర్స్. శాసనసభాపతికి జ్యుడిషియల్ అధికారాలు ఉంటాయి గనుక ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ నైతిక విలువల ప్రాతిపదికగా స్పందించాల్సి వస్తే పారదర్శకంగా వ్యవహరించే నేతగా కోడెల శివప్రసాదరావు ఏం చేస్తారన్నదని మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
స్పీకర్ చేతిలో ఫిరాయింపుదారుల భవితవ్యం..
తెలుగుదేశం పార్టీలో కలిపేసుకున్న 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేస్తారా? అధికార పక్షం వ్యూహానికి అనుగుణంగా వ్యవహరిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతినిస్తారా? అని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని ఏనాడో అడిగినా, స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కోడెలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఫిరాయింపుదారులతో సభ నిర్వహణ సబబేనా
ఒక దొంగతనంలో దొరికి హైదరాబాద్ అసెంబ్లీ ఖాళీ చేసిన సీఎం చంద్రబాబు రెండో దొంగ సొత్తుతో కొత్త అసెంబ్లీలో ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్దేనని జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. ఫిరాయింపు (దొంగ సొత్తు) ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అవినీతి మకిలి నవ్యాంధ్రప్రదేశ్ కు అంటదా? అన్న ప్రశ్న ఆంద్రులందరి మనస్సుల్లోనూ తొలుస్తున్నది. అయితే కోడెల శివప్రసాదరావు గురించి తెలిసిన వారెవ్వరైనా ఆయన పారదర్శకంగా వ్యవహరిస్తారన్న భావన ఉన్నా.. ఇటీవల హైదరాబాద్కు గుడ్ బై చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
అనుబంధం తెగుతుందని ఆవేదన
మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంతో పెనవేసుకున్న అనుబంధం తెగిపోతున్నదన్న కోడెల శివప్రసాదరావు తదుపరి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. గతేడాది చివర్లో హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలే చిట్ట చివరివి. హైదరాబాద్ నగరానికి అధికారికంగా ‘గుడ్ బై' చెప్పినా.. చట్టబద్ధంగా అసెంబ్లీని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలా? వద్దా? అంటే 10 ఏళ్ల పాటు తమ ఆధీనంలో ఉంటుందని చెప్పినా తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని తన మనస్సులో మాట బయట పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపులకు పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా? లేదా? అన్న విషయం అతి త్వరలోనే తేలిపోతుందని భావిస్తున్నారు.
1980వ దశకంలో ఇలా..
తెలుగుదేశం పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఆధిపత్య రాజకీయాలకు తెర తీయడం ఇదే మొదటిసారి కాదు చివరిసారి కాదు. 1978లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంజయ్య క్యాబినెట్లో సభ్యుడిగా ఉన్నా.. చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించడంలో విఫలమయ్యారు. కానీ 1983లో ‘తెలుగు ఆత్మగౌరవానికి' ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే అధికార పార్టీలో చేరి.. నాటి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా కుతూహలమ్మను పక్కకు తప్పించి ఆధిపత్య మార్క్ రాజకీయం ప్రదర్శించారు.
తెలంగణాలో ఆధిపత్య రాజకీయం
తాజాగా ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లోనూ అదే ఆధిపత్య రాజకీయాలకు తెర తీశారు. అంతకుముందు తెలంగాణలోనూ ఆధిపత్య రాజకీయాలు చేయబోయి చేతులు కాల్చుకున్నారు. అదే ఓటుకు నోటు కేసు.. ప్రస్తుతం టీడీపీ తెలంగాణశాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సారథ్యంలో 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు జరుగుతుండటం.. నిఘా విభాగం కనుసన్నల్లో సంగతంతా బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల అభివ్రుద్ధి కోసం తరలివస్తున్నారని చంద్రబాబు, ఆయన క్యాబినెట్ సహచరులు, నేతల మాట. కాకపోతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలహీన పరిచేందుకేనన్న వ్యూహం తెలుగు రాష్ట్రాల్లోని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఓటుకు నోటుపై ఇలా..
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటిలో నేరుగా రేవంత్ రెడ్డి బేరసారాలు చేసి ఎసిబికి చిక్కారు. అంతే కాదు. నాటి వ్యవహారాలు ఎప్పటికప్పుడు రికార్డయ్యాయి. స్టీఫెన్సన్తో నేరుగా చంద్రబాబు సంబాషణల ఆడియో టేప్ బయటికి వచ్చింది. కానీ తెర వెనుక రాజకీయాల్లో చంద్రబాబు కేసు నుంచి బయట పడ్డారు. కానీ తర్వాత తెలంగాణలో ఉండటం అసాధ్యమని తేలిపోవడంతో క్రమంగా ఏపీకి మాత్రమే పరిమితమయ్యారు. బెజవాడ కేంద్రంగా గెస్ట్ హౌస్ను అధికారిక నివాసంగా మార్చుకుని శాసనసభ, సచివాలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూనే పాలన సాగించారు చంద్రబాబు.
నవ్యాంధ్ర భవితవ్యం ఇలా..
గమ్మత్తేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రథమ పౌరుడైన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఆహ్వానం లేకుండానే అసెంబ్లీ ప్రారంభోత్సవం జరిగిపోయింది. ఇదీ సంప్రదాయాల పట్ల, నైతిక విలువల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతకు గల నిబద్దత. ఈ నేపథ్యంలో ఫిరాయింపు రాజకీయాలతో నవ్యాంధ్ర భవితవ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.