కారు స్పీడ్: బీటలు వారిన టడిపి, కాంగ్రెస్ కోటలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కారు స్పీడ్కు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కోటలు బీటలు వారాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని కాంగ్రెసు, టిడిపి గెలుచుకున్న అన్ని శానససభా నియోజకవర్గాల్లోనూ తెరాస పాగా వేసింది. కాంగ్రెసు, టిడిపి ఓట్లకు భారీ స్థాయిలో గండి పడింది. అవన్నీ తెరాస ఖాతాలో చేరాయి.
2014 శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొమ్మిదింటిని తెలుగుదేశం, ఐదింటిని భాజపా, ఏడింటిని ఎంఐఎం గెలుచుకున్నాయి. తెరాస మూడు స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. అత్యధికంగా 14 నియోజకవర్గాల్ని గెల్చుకున్న ప్రకారం తెలుగుదేశం, బిజెపి కూటమి గ్రేటర్ ఎన్నికల్లోనూ గట్టి ప్రభావం చూపించాల్సి ఉంది.
అయితే, టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని స్థానాలను తెరాస ఊడ్చేసింది. బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పది డివిజన్లకు గాను తొమ్మిదింటిని తెరాస గెలుచుకుంది. మిగిలిన ఒక దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
టిడిపి హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆరు డివిజన్లు ఉంటే అయిదింట తెరాస విజయం సాధించింది. మరో డివిజన్ను ఎంఐఎం గెలుచుకుంది.
కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి 1,14,235 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అదే నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులకు 53,641 ఓట్లు మాత్రమే దక్కాయి. అంటే సగానికిపైగా ఓట్లను తెదేపా కోల్పోయింది. గ్రేటర్ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ తెరాసకు పడ్డాయి,.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థికి 84,316 ఓట్లు వస్తే ఇప్పుడు దాని పరిధిలోని డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులకు 64,723 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు 25 శాతం ఓట్లను టిడిపి జారవిడుచుకుంది.
బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గంలో 2014 అసెంబ్లీ ఎన్నికల ఆ పార్టీకి 81,430 ఓట్లు వస్తే గ్రేటర్ ఎన్నికల్లో 36,859 ఓట్లకు తగ్గిపోయాయి. అంటే 50 శాతానికి పైగా ఓట్లను బిజెపి కోల్పోయింది.
బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. 2014లో చింతల రామచంద్రారెడ్డికి 53,162 ఓట్ల రాగా గ్రేటర్ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గ పరిధిలో భాజపా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 32,580 మాత్రమే.
మొత్తంగా ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభా నియోజకవర్గాల్లో ఆ పార్టీలను తెరాస చావు దెబ్బ తీసి, బల్దియాపై గులాబీ జెండాను ఎగురేసింది.