హీరోల స్టూడియోలపై దృష్టి: నాగ్, కృష్ణలకు షాక్!
హైదరాబాద్: అక్రమ నిర్మాణాల పైన దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించిన వాటి పైన కూడా దృష్టి సారించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భూములు ఉద్దేశిత అవసరాలకు కాకుండా మరో అవసరానికి వినియోగించకపోవడం, అసలే వినియోగించకుండా ఖాళీగా ఉంచడం.. ఈ రెండు అస్త్రాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల స్వాధీనం దిశగా ముందుకు కదులుతోంది.
తాజాగా అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలపై దృష్టి సారించింది. దీనిపై గురువారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఎస్కే సిన్హా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ రెండు స్టూడియోల వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఆచితూచి ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగాన్ని రిలయన్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు.
ఇది నిర్దేశిత జీవోకు వ్యతిరేకమని అధికారులు చెబుతున్నారట. దీని ఆధారంగానే అన్న పూర్ణ స్టూడియోపై ముందుకు వెళ్లనున్నారు. పద్మాలయ కేసులో గతంలో ప్రభుత్వమే స్టూడియోకు అనుకూలంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిని వెనక్కి తీసుకోవాలని గురువారం సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు ఇప్పటికే సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాల్సి ఉంది.
ఏడాది కిందటే పద్మాలయ భూములను స్వాధీనం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై తెలంగాణ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ(టీఎల్ఎంఏ) నిర్ణయం తీసుకోవాలి. కాగా, అన్నపూర్ణ స్టూడియోకు 1978లో తొలిదశలో 16 ఎకరాలు, మలిదశలో మరో 6 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 22 ఎకరాలను సినీ రంగం అభివృద్ధికి కేటాయించారు.
అయితే 6 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ స్టూడియోలో సినీ నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. 16 ఎకరాల విషయంలోనే వివాదం ఉంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ భూమిని వెనక్కి తీసుకోగా అక్కినేని నాగేశ్వర రావు హైకోర్టుకు వెళ్లడంతో 1985లో న్యాయస్థానం తీర్పుతో భూమిని తిరిగి స్టూడియోకు స్వాధీన పరిచారు. 1998లో సేల్ డీడ్ కూడా అయింది.
ఈ సేల్ డీడ్లో నిబంధనలు మార్చాలని 2009లో అక్కినేని దరఖాస్తు పెట్టుకోగా, 2010లో షరతులతో కూడిన జీవో ఇచ్చారు. 1985లో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అన్నపూర్ణ స్టూడియోకు అనుకూలంగా ఉంది. ఇక పద్మాలయ స్టూడియో వ్యవహారంలో ఇదే పరిస్థితి ఉందట. ఈ స్టూడియోకు 9 ఎకరాల స్థలం ఇవ్వగా, అందులో ఐదెకరాల స్థలాన్ని ఓ సంస్థకు పద్మాలయ విక్రయించింది. 2005లో అప్పటి వైయస్ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత భూమిని తిరిగి పద్మాలయకే అప్పగించారు.
ఇదిలా ఉండగా.. సినీ రంగానికే చెందిన కేఎస్ ప్రకాశ్, చక్రవర్తికి రికార్డింగ్ స్టూడియోల కోసం కేటాయించిన భూముల స్వాధీనానికి గురువారం నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వీరద్దరికీ ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఖాళీగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేఎస్ ప్రకాశ్కు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 2200 గజాలు కేటాయించారు. అలాగే చక్రవర్తికి రోడ్ నెంబర్ 14లో 2000 చదరపు గజాలు కేటాయించారు. ప్రభుత్వ అనుమతి, టీఎల్ఎంఏ ఆదేశాలు రాగానే స్వాధీనం చేసుకొని, ఇతర ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.