ఆ 4గురు ఎవరు?: జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు, సవాల్పై దాటవేత
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. మరికొంతమంది వరుసలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు పార్టీ నుంచి జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జగన్ కూడా గుర్తించినట్లున్నారు.
అదే విషయాన్ని ఆయన చెప్పారు. ఇప్పటికే పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడారని, ఆ సంఖ్య ఎంతకు పెరుగుతుందో తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో నలుగురు ఐదుగురు వెళ్లవచ్చునని, అయినా తమకు నష్టం లేదని ఆయన చెప్పడం గమనార్హం.
సిగ్గు, రోషం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి లేదా అనర్హత వేటు వేసి ప్రజల ముందుకు తీసుకురావాలని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో.. దేవుడు ఎవరిని దీవిస్తారో, దానినే ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకుందామన్నారు.
తన పార్టీ ఎమ్మెల్యేల్లో మరికొందరు వెళ్లిపోయినా తనకేమీ నష్టం లేదని అన్నారు. కానీ, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబుపై ఉంటుందన్నారు. శనివారం ఆయన రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడారు.

వైయస్ జగన్
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, అవినీతి డబ్బుతో సంతలో గొర్రెలను కొన్నట్లుగా ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 - రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, ఇంత నల్లధనం చంద్రబాబుకు ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఆశ చూపిస్తున్నారన్నారు.

వైయస్ జగన్
ఇసుక వ్యాపారంలో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు నారా లోకేష్, మంత్రులు వాటాలు పంచుకున్న విధానం, రాజధానిలో బినామీలతో భూములు కొనిపించిన వ్యవహారాన్నీ గవర్నర్కు జగన్ వివరించారు.

వైయస్ జగన్
విద్యుత్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రయివేటు సంస్థల నుంచి ఎక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పు పడుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లేఖలు రాసిన విషయాన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చర్యలను అడ్డుకోవాలని గవర్నర్ను జగన్ కోరారు.

వైయస్ జగన్
ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 'సేవ్ డెమోక్రసీ' అనే నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించామని జగన్ చెప్పారు. జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ఈ నెల 25న ఢిల్లీకి వెళ్లనున్నామని, రాష్ట్రపతి, ప్రధాని, ఇతర పార్టీల జాతీయ నేతల అపాయింట్మెంట్లు కోరామన్నారు. వాళ్లకు రాష్ట్రంలోని అవినీతి పాలన వివరిస్తామన్నారు.

వైయస్ జగన్
గతంలో రాజ్ భవన్ ఎదుటే ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసిరిన జగన్.. ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా ఆయన వెళ్లిపోయారు. కాగా, తమ పార్టీ నుంచి ఇంకొంతమంది వెళ్తారని జగన్ స్వయంగా చెప్పడం చర్చనీయాంశమైంది. వారు ఎవరు అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications