జగన్ ఆ ఛాన్స్ ఉపయోగించుకోలేదు, సర్వనాశనం: జేసీ, కేశినేని హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు మంగళవారం నిప్పులు చెరిగారు.
అమరావతి/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు మంగళవారం నిప్పులు చెరిగారు.
జగన్ సీఎం అయితే సర్వనాశనం
జగన్ ముఖ్యమంత్రి అయితే సర్వనాశనం తప్పదని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్, జగన్ సీఎం అయితే మళ్లీ వెనుకబడిపోతుందని చెప్పారు. ఆయన జీవితంలో సీఎం కాలేడన్నారు.
జగన్ అప్పుడు ఉపయోగించుకోలేదు
గతంలో జగన్ కు అవకాశం ఉన్నప్పటికీ, దానిని ఆయన సరిగా ఉపయోగించుకోలేకపోయారని జేసీ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబునే మళ్లీ గెలిపించాలన్నారు. చంద్రబాబు ఎంతో దూరదృష్టి ఉన్న నాయకుడని కొనియాడారు.
బంగాళాఖాతంలో పడేయాలి
జగన్ను బంగాళాఖాతంలో కలిపేయాలని కేశినేని నాని అన్నారు. రూ.60 కోట్ల కుంభకోణానికి అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని, ఈ రకంగా చూసుకుంటే లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్కు 200ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.
జగన్కు హెచ్చరిక
హత్యా రాజకీయాలను, శవ రాజకీయాలను జగన్ మానుకోవాలని కేశినేని నాని సూచించారు. లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారని నాని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసిపి నేత నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిలపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్పై కేశినేని విమర్శలు గుప్పించారు.