లోకేష్ ఛాంబర్ ఎదుట పడిగాపులు: కిందపడి కొట్టుకున్న మహిళ..
అలా చాలాసేపు వేచిచూసిన ఆమె.. సాయంత్రం 5గం. సమయంలో తీవ్ర నిరాశతో కిందపడి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది.
అమరావతి: తన ఇద్దరు పిల్లలు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుండటంతో.. ఆర్థిక సహాయం కోసం ఓ మహిళ ఏపీ సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. 8నెలల సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని రాణిగారి తోటకు చెందిన మూలె గోవిందమ్మ(35)కు ఇద్దరు పిల్లలు మోహన్ రెడ్డి(10), నాగేంద్ర కుమారి(15)లు ఉన్నారు. వీరిద్దరు కొన్నేళ్లుగా తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నారు. శరీరమంతా పొలుసులా చర్మం ఊడిపోతుండటంతో వీరిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
కూలీ పనిచేసుకుని జీవించే గోవిందమ్మ కుటుంబం ఇప్పటికే వీరి చికిత్స కోసం చాలా ఖర్చు చేసింది. ఇక తమవల్ల కాకపోవడంతో.. సహాయం కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ వస్తున్నారు. అలా 8నెలల నుంచి సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మధ్యలో ఒకసారి సీఎం చంద్రబాబును కలిసే అవకాశం రాగా.. నాగేంద్ర కుమారికి వికలాంగుల పెన్షన్ సహా మందుల కోసం కొంత డబ్బు ఇచ్చారు.
మోహన్ రెడ్డికి ఎలాంటి సహాయం అందలేదు. మరోవైపు ఇద్దరికి రోజురోజుకు వ్యాధి తీవ్రం అవుతుండటంతో గోవిందమ్మ సచివాలయంలోని అధికారుల చుట్టూ తిరుగుతోంది. శుక్రవారం పిల్లలను తీసుకుని సచివాలయానికి రాగా.. సీఎం లేరని సిబ్బంది ఆమెను అనుమతించలేదు. మంత్రి లోకేష్ వద్దకు వెళ్లాలని వారు సూచించడంతోఆయన ఛాంబర్ వద్ద గోవిందమ్మ చాలాసేపు పడిగాపులు కాచింది.
అలా చాలాసేపు వేచిచూసిన ఆమె.. సాయంత్రం 5గం. సమయంలో తీవ్ర నిరాశతో కిందపడి కొట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బలవంతంగా బయటకు పంపించారు. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది.