తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు, ఆపై ఏం జరుగుతుందో చెప్పిన ఐఎండీ!
తెలంగాణా రాష్ట్రంలో వాతావరణం రోజు రోజుకూ భిన్నంగా ఉంటుంది. ఎండాకాలంలో ఒక పక్క ఎండలు మండుతుంటే, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండుతున్న వేళ ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే సమయంలో తాజా వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం
ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో భారీ ఈదురు గాలులతో పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పండించిన పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.

హీట్ వేవ్ హెచ్చరిక
వర్షాలు కొంతకాలం ఉపశమనం కలిగించినా, త్వరలోనే ఎండలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరించారు. మే 12 నుంచి 'హీట్ వేవ్ 3.0' ప్రారంభమవుతుందని, ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరవచ్చని అంచనా వేశారు. మే 18 నుంచి 22 వరకు తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అప్పుడే
హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే సూచనలు ఉన్నాయి. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 15న అండమాన్ దీవులను, జూన్ 1న కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోకి అవి చేరడానికి మరికొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, వాతావరణ మార్పులకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications