డెడ్సిటీ: ఇలా ఐతే బెంగళూరులో బతకడం కష్టమే!
బెంగళూరు: భారత సిలికాన్ వ్యాలీగా, హరిత నగరంగా పేరొందిన బెంగళూరు రానున్న ఐదేళ్లలో జీవించేందుకు వీలుకాని స్థితిలోకి మారనుందని భారత విజ్ఞానశాస్త్రాల సంస్థ(ఐఐఎస్సీ) అధ్యయనం హెచ్చరించింది. ఐఐఎస్సీ అధ్యయనం ప్రకారం.. గత 40 ఏళ్లలో బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో నిర్మాణాలు చోటుచేసుకున్నాయి. 525 శాతం వృద్ధి సాధించింది.
బెంగళూరులోని వృక్షసంతతిలో 78 శాతం క్షీణించింది. జలవనరులు 79శాతం నాశనమయ్యాయి. పట్టణీకరణ కారణంగా చెరువులు, చెట్లు కనుమరుగైపోయాయి. ఆర్థిక బూమ్ గత రెండు దశాబ్దాల్లో నగరాన్ని చాలామేర ధ్వంసం చేసింది.
గత 25 ఏళ్లలో నగర జనాభా 40లక్షల నుంచి కోటికిపైగా చేరింది. పిచ్చిగా, అర్థంలేని రీతిలో సాగిన అభివృద్ధి విపరిణామాలు భవిష్యత్తులో హానికరంగా మారనున్నాయని ఐఐఎస్సీ సెంటర్ ఫర్ ఎకలాజికల్ స్టడీస్కు చెందిన ప్రొఫెసర్ టీవీరామంచంద్ర హెచ్చరించారు.
నగర క్షీణతకు బెంగళూరు అభివృద్ధి ప్రాధికార సంస్థ(బీడీఏ)నే పలువురు తప్పుపడుతున్నారు. జనసమ్మర్ధాన్ని తగ్గించకపోతే మూల్యం తప్పదని ఐఐఎస్సీ అధ్యయనం స్పష్టం చేసింది.
చెట్టుచేమల ప్రాంతం 78 శాతం తగ్గిపోయింది. జలవనరులు 79 శాతం తగ్గాయి. 'ఇదంతా మతిలేని, ముందుచూపులేని అభివృద్ధి. ప్రణాళికలేని పట్టణీకరణ వల్ల బెంగళూరు వచ్చే ఐదేళ్లలో నివాసయోగ్యం కాకపోవడంతోపాటు మృతనగరం(డెడ్ సిటీ)గా మారనుంది. ప్రైవేటు డెవలపర్లు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. నగరంలో 15 నుంచి 20 శాతం ఖాళీస్థలం ఉండాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు' అని ప్రొఫెసర్ రామచంద్ర తెలిపారు.
ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోవాలని, భవన నిర్మాణాలను తగ్గించేందుకు.. కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని సూచించారు. రాజకీయ నాయకులకు బీడీఏ వత్తాసు బెంగళూరు అభివృద్ధి సంస్థ(బీడీఏ) రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం భూములను పందేరం చేస్తోందని, దీంతో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగి, పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. 40 వేల ఎకరాల ఖాళీ స్థలంలో పార్కులు, నీటి వనరులను ఏర్పాటు చేయాలని వారు సూచిస్తున్నారు.