కేంద్ర బడ్జెట్ 2018: 29 వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లు తగ్గాయ్, ఇప్పుడు ఏమేం చౌక అంటే...
Recommended Video
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం పలురకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తూ వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ దృష్ట్యా ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ నేతృత్వంలో గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.
తాజా సమావేశంలో 29 వస్తువులు, 53 సేవలపై పన్ను రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వీటిలో ముఖ్యంగా హస్తకళల వస్తువులు ఉన్నాయని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
29 వస్తువులపై పన్ను రేట్లు తగ్గింపు...
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా గురువారం జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశం నిర్వహించింది. వివిధ రాష్ట్రాల ఆర్థికమంత్రులు కూడా దీనికి హాజరయ్యారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. 29 రకాల హస్తకళ వస్తువులను 0% శ్లాబులోకి తెచ్చామని, మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై రేట్లను తగ్గించినట్టు ప్రకటించారు. మార్పులు చేసిన జీఎస్టీ రేట్లను జనవరి 25 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
పెట్రోల్, డీజిల్పై వచ్చే సమావేశంలో చర్చ...
జీఎస్టీ తాజా సమావేశంలో రిటర్నులు, ఫైలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే అంశంపైనా చర్చించారు. రూ.50 వేలకు పైబడిన సరుకుల అంతర్రాష్ట్ర రవాణాకు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ వేబిల్లు (ఈ-వేబిల్లు)ను పొందుపర్చాలన్న నిబంధనను ఫిబ్రవరి 1నుంచి కచ్చితంగా అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అయితే కీలక అంశమైన పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని, వచ్చే సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశముందని జైట్లీ వివరించారు.
బీడీలపై జీఎస్టీ తగ్గించాలని కోరినా..
జీఎస్టీ సమావేశం తరువాత తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బీడీలపై జీఎస్టీ తగ్గించాలని తాము కోరినా.. జీఎస్టీ కౌన్సిల్ మాత్రం ఆమోదించలేదని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వస్తువులపై మాత్రం జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారని ఆయన తెలిపారు.
వేటి పన్ను రేట్లు.. ఎంతెంత తగ్గాయంటే...
సెకండ్హ్యాండ్ కార్లు, ఎస్యూవీలపై 28 నుంచి 18 శాతానికి, పాత వాహనాలపై 12 శాతానికి తగ్గించారు. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై ప్రస్తుతమున్న 3 శాతం పన్నును 0.25 శాతానికి తగ్గించారు. బయోడీజిల్ను 18 నుంచి 12 శాతానికి, కాలుష్యరహిత ప్రజారవాణా బస్సులపై 28 శాతం నుంచి 18 శాతానికి పన్నురేట్లను తగ్గించారు. ఇంకా.. నీటిపారుదల పరికరాలు, పిప్పరమెంట్లు, 20 లీటర్ల నీళ్లబాటిళ్లు, ఎరువుల్లో వాడే పాస్ఫరిక్ యాసిడ్, చింతపిక్కల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు సంస్థలు సరఫరా చేసే వంటగ్యాస్, వెదురు వస్తువులు, మఖ్మల్ వస్త్రాలు, రైస్బ్రాన్ నూనెలు పన్ను తగ్గించిన వాటిలో ఉన్నాయి.
ప్రభుత్వానికి రూ. 1000 కోట్లు లోటు...
ఆయా వస్తువులపైనే కాకుండా 54 సేవలపైనా పన్నులను సవరించారు. 29 వస్తువులు, 53 సేవల పన్నురేట్ల తగ్గింపుతో రూ.వెయ్యి కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఈ తగ్గింపులు, సవరణలు జనవరి 25 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మీడియాకు తెలిపారు.
జీఎస్టీ రిటర్నులపై వచ్చే సమావేశంలో నిర్ణయం...
జీఎస్టీ రిటర్నుల దాఖలు విధానాన్ని సరళీకృతం చేయడంపై సమావేశంలో చర్చ మాత్రమే జరిగిందని, నిర్ణయమేదీ తీసుకోలేదని అరుణ్జైట్లీ తెలిపారు. సమావేశంలో ఈ అంశంపై నందన్ నీలేకని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాలకు పంపి వచ్చే సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని జైట్లీ వివరించారు.