వైయస్ శక్తిమాన్: సర్వే దుమారం
ఇంతకీ సర్వే ఏం తేల్చింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చాలా బలంగా ఉన్నారని తేల్చి చెప్పింది. కాంగ్రెసుకు 45 శాతం ప్రజల మద్దతు ఉందని ఆ సర్వే చెప్పింది. ఈ మేరకు ప్రజల మద్దతు ఉంటే కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి కూడా ఆపలేదనేది నిజం. తెలుగుదేశం పార్టీకి 30 శాతం మద్దతు ఉన్నట్లు తెలిపింది. బిజెపి మాత్రం కొంత సంతోషంగా ఉంది. బిజెపికి 9 శాతం ఓటర్ల మద్దతు ఉందని తెలపడమే అందుకు కారణం. అంటే రాష్ట్రంలో బిజెపి బలం పెరిగినట్లు.
ప్రజారాజ్యం పార్టీకి 7 శాతం ఓటర్ల మద్దతు మాత్రమే ఉందట. ఇది బిజెపికి ఉన్న మద్దతు కన్నా తక్కువ. అయితే కొత్త పార్టీ కావడంతో ప్రజారాజ్యం మద్దతు విస్తృతి పెరగవచ్చునని సర్వే తెలిపింది. వామపక్షాలకు 2 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతు లభిస్తున్నట్లు సర్వే తేల్చింది. ఇతరులెవరనేది తేల్చ లేదు. బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి, నవ తెలంగాణ పార్టీ, మన పార్టీ కావచ్చు.
ఆంధ్రప్రదేశ్ సర్వేకు వచ్చేసరికి సిఎన్ఎన్ ఒక కొలికి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సాంపిల్ సైజును తక్కువగా తీసుకున్నామని, అందువల్ల 3 శాతం మార్జీన్ ఎర్రర్ ఉండవచ్చునని చెప్పింది. ఇది ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నమా, కావచ్చు. ఒక తెలుగు దిన పత్రిక ప్రతినిధి రాజగోపాలన్ సర్వే ప్యానెల్ చర్చలో పాల్గొంటూ రాజశేఖర రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీగా అభివర్ణించారు. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదని, కానీ గత మూడు నెలలుగా అది పెరుగుతోందని నాగేశ్వర్ అనే నిపుణుడు అన్నారు. ఇందులో వాస్తవం ఉంది. ఎన్నికలు సమీపించేనాటికి అది మరింత పెరగవచ్చు.
రాష్ట్రం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే 27 శాతం మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, 52 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నట్లు తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు 63 శాతం మంది రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నట్లు సర్వేలో తెలింది. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలకు మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కాంగ్రెసు గణనీయంగా బలహీనపడే అవకాశాలున్నట్లు సర్వేను బట్టే తెలుస్తోంది. తెలంగాణలోనే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గెలుచుకునే సీట్లను బట్టే రాష్ట్రంలో అధికారంలోకి రావడం, రాకపోవడం అనేది నిర్ణయమవుతుంది. ఉప ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
తెలంగాణలో చంద్రబాబు, మిగతా ప్రాంతాల్లో రాజశేఖర రెడ్డి తమ బలాలను చాటుకుంటారని ప్యానెలిస్టులు చివరగా తేల్చారు. కానీ పరిస్థితి అలా ఉండకపోవచ్చు. ప్రజారాజ్యం పార్టీ బలం సర్వేలో కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని మహా కూటమి తన బలాన్ని చాటుకుంటే, మిగతా ప్రాంతాల్లో కాంగ్రెసు, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు సీట్లను పంచుకునే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణేతర ప్రాంతాల్లో వస్తే కాంగ్రెసుకు మిగతా రెండు పార్టీల కన్నా ఎక్కువ సీట్లు రావచ్చు. అంత మాత్రాన సర్వే ప్రకారం తిరుగులేని శక్తిగా రాజశేఖర రెడ్డి ముందుకు వస్తారని చెప్పడం సరి కాకపోవచ్చు.