తెలంగాణ: అసలేం జరిగింది?
తెరాస అంత అద్భుతమైన ఫలితాలు సాధించడానికి, ఏకపక్షంగా ఫలితాలు రావడానికి తెలుగుదేశం, కాంగ్రెసు సీమాంధ్ర నాయకులూ సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీల్లో అణగిమణగి ఉంటున్న తెలంగాణ నాయకులూ కారణం. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర నాయకులు శివాలెత్తి తెలంగాణకు వ్యతిరేకంగా నడిపిన రాజకీయం తెలంగాణ ప్రజలను కలచివేసింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకోవడం పెద్ద వంచనగా కనిపించింది. చంద్రబాబు వైఖరి మారకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేది. సీమాంధ్ర నాయకుల ఒత్తిడి రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో నోట్లో ముద్దను కాకులు తన్నేసుకుపోయినట్లు తెలంగాణ ప్రజలు బాధపడ్డారు.
తాము వద్దంటున్నా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వరంగల్ ఓదార్పు యాత్రకు వెళ్లడానికి అహంకారం ప్రదర్శించడం కూడా తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర నాయకుల ఆధిపత్య ధోరణిని అర్థం చేయించింది. మొత్తంగా సీమాంధ్ర నాయకులు ఆధిపత్య ధోరణి, అహంకార ప్రదర్సన, తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ నాయకుల దాసోహ ప్రవృత్తి తెలంగాణలోని అన్ని వర్గాలను కలచివేసింది. రాజీనామాల ద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు వెనక్కి తగ్గడంతో తెలంగాణలో తీవ్రమైన ఆగ్రహం గూడు కట్టుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పట్ల, ఆ పార్టీల నాయకుల పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను తెరాసకు ఓటు వేయడం ద్వారా తెలంగాణ ప్రజలు వ్యక్తం చేశారు.