సిఎం కిరణ్ ఎవరి సలహాలు వినరు?
చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు ఇప్పటికి చాలాసార్లు సిఎంపై విరుచుకు పడ్డారు. తెలంగాణ అంశం, తనకు భద్రత పెంపు విషయాన్ని పక్కన పెడితే శాఖ విషయంలోనూ ఆయన సిఎంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లుగా వినవద్దని తన శాఖ అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేస్తున్నారని దీంతో అధికారులు తనకు సహకరించడం లేదని శంకర్ రావు విలేకరుల సమావేశంలో బాంబు పేల్చారు. మరో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సైతం బయటకు ముఖ్యమంత్రితో విభేదాలు లేవని చెప్పినప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారనే వాదనలు వినిపించాయి. మరోవైపు హైదరాబాదుకు చెందిన మరో మంత్రి తన శాఖకు సంబంధించిన ఫైల్స్ తన అనుమతి లేకుండానే చక చకా కదులుతున్నాయని, అందుకు సిఎం కిరణే కారణమని ఆవేదన వ్యక్తం చేశారట.
సిఎంకు దగ్గరగా ఉన్న మంత్రులలో ఒకరైన తెలంగాణ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు సైతం ఇటీవల సిఎం తీరుపై అలిగారు. రూ.1కి కిలో బియ్యం పథకం తన శాఖకు సంబంధించినదే అయినప్పటికీ తన మాట మాత్రమైనా చెప్పకుండా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి అంతే అసంతృప్తితో ప్రకటన చేసే సమయంలో మేం పక్కనే ఉన్నప్పటికీ మాకు కూడా చెప్పకుండా కిరణ్ ప్రకటన చేశారని అయితే ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా మనం సర్దుకు పోక తప్పదని శ్రీధర్ బాబును బుజ్జగించాలట. పలు కీలక నిర్ణయాలలో ముఖ్యమంత్రి మంత్రివర్గంతో చర్చించక పోవడం, కనీసం సంబంధింత మంత్రికి సైతం తెలియకుండా చేయడంతో దాదాపు మెజార్టీ మంత్రులు ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వంపై పట్టు సాధించుకోవాలనే ఆతృతలో సిఎం కిరణ్ ఎవరి సలహాలు తీసుకోకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.