Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్‌కు 'మిర్చి ఘాటు': అమిత్ షా స్కెచ్ ఇదీ...

గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద మిర్చి రైతుల ఆందోళన కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులను బాగానే కదిలించినట్లే కనిపిస్తున్నది.

హైదరాబాద్: గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద మిర్చి రైతుల ఆందోళన కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులను బాగానే కదిలించినట్లే కనిపిస్తున్నది. అందునా తెలంగాణలో విస్తరించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉవ్విళ్లూరుతున్నారు.

హైదరాబాద్ లోక్‌సభా నియోజకవర్గం కేంద్రంగా తెలంగాణలో రాజకీయంగా విస్తరించడమే లక్షంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆయన అనుసరించిన వ్యూహం విజయవంతం కావడంతో తెలంగాణలో ఆయన వ్యూహం అమలులోకి వస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని రాష్ట్రంలోని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు.

హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, భువనగిరి లోక్‌సభా స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వంటి వారు తెలంగాణలో పర్యటిస్తున్నారు.

తెలంగాణ రైతుకు సాయంలోనూ కేంద్రం రాజకీయం

తెలంగాణ రైతుకు సాయంలోనూ కేంద్రం రాజకీయం

హైదరాబాద్ లోక్ సభా స్థానంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత నెల 14నే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ ఖమ్మం మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగిన తర్వాత కానీ కమలనాథుల్లో కనువిప్పు కలుగడమే సందేహాలకు తావిస్తూ వచ్చింది. ఆ దిశగానే తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు సోమవారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి ఎస్ఎస్ ఆహ్లువాలియాను కలిసి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద జోక్యం చేసుకోవాలని కోరారు. కాకపోతే రాజకీయ ప్రయోజనాలే ప్రాథమ్యంగా అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ స్పందించడమే ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తున్నదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

దేశ ప్రగతి పట్ల కమలనాథుల కప్పదాట్లు

దేశ ప్రగతి పట్ల కమలనాథుల కప్పదాట్లు

వరంగల్, భువనగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గణనీయ స్థాయిలోనే మిర్చి రైతులు ఉన్నారు. సమస్య ముంచుకొచ్చినప్పుడే స్పందించడం రాజకీయ నాయకులు, ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే తమకు అవకాశం కల్పిస్తే ప్రతిచోటా వైకుంఠాన్ని అందుబాటులోకి తెస్తామనడం అమిత్ షా వంటి వారికి మామూలేనన్న విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీలు ప్రభుత్వాలను నడుపుతున్న రాష్ట్రాల్లో అధికారం అప్పగించమని కోరే ప్రతిసారి బీజేపీ ఇదే ప్రతిపాదన తేవడం ఆనవాయితీగా వస్తున్నదని అందరికీ తెలిసిన సంగతే.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర ఆరోపణలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర ఆరోపణలు

మార్చి నెలాఖరు నుంచే మిర్చి రైతులకు మార్కెట్ యార్డుల్లో వ్యాపారుల నుంచి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించడంలో వెనుకంజ వేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం' కింద జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనపై సాచివేత ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చిందని విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సైతం కేంద్ర ప్రభుత్వంపైనే నెపం వేస్తూ వచ్చాయి. కానీ కాలం ఎవరికోసమో ఆగదు కదా..

మార్కెట్ మాయాజాలంలో రైతుకు మిగిలిన ఆక్రందన

మార్కెట్ మాయాజాలంలో రైతుకు మిగిలిన ఆక్రందన

కిందటేడు మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి ధర రూ.12 వేల నుంచి రూ.15 వరకు పలకడంతో అన్నదాతల్లో ఆశలు మొలకెత్తాయి. ఒక్క ఏడాది మంచి పంట వచ్చి, దానికి తగ్గట్లు ఇదే ధర లభిస్తే తమ కుటుంబ కష్టాలు తీరిపోతాయని ప్రతి రైతు ఆశించడంలో తప్పేమీ లేదు. దీనికి తోడు వర్షాలు పుష్కలంగా కురవడంతో అన్నదాత ఆశించినట్లే దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ మార్కెట్ మాయాజాలంలో ‘వ్యాపార' దేవుళ్లు సైంధవుల్లా అడ్డం పడ్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీనికి తోడు వరుసగా రెండు రోజుల సెలవులని, అదనీ ఇదనీ చాపకింద నీరులా ప్రచారంచేస్తూ రైతులను అయోమయానికి గురిచేశారు.

బీజేపీలో వేడి పెంచిన ఖమ్మం మిర్చి రైతుల ఆగ్రహం

బీజేపీలో వేడి పెంచిన ఖమ్మం మిర్చి రైతుల ఆగ్రహం

ఆలస్యమైతే ధర రాదేమోనన్న ఆందోళనతో భారీగా ఖమ్మం మార్కెట్‌కు మిర్చి తరలి వచ్చింది. మార్కెట్ నిండుగా పంట కనిపించే సరికి వ్యాపారుల్లోనూ తమదైన మార్కెట్ వ్యూహం తలెత్తి పైకి చూసింది. మరింత లాభం కూడగట్టేందుకు పూనుకున్నది. నాణ్యత లేదని పేర్కొంటూ క్వింటాల్‌కు రూ.2500 మించి పెట్టలేమని తేల్చేశారు. గమ్మత్తేమిటంటే గత ఏడాది తాలు మిర్చి కూడా క్వింటాల్ రూ.4000 పై చిలుకు పలికింది. దీంతో ఆరుగాలం కష్ట పడిన అన్నదాత ఆక్రోశం కట్టలు తెచ్చుకున్నది. సహజ సిద్ధంగానే రగిలిన ఆగ్రహావేశాలతో చేపట్టిన నిరసన విధ్వంసానికి దిగింది. జాతీయ స్థాయి దినపత్రికల్లో, చానెళ్లు, డిజిటల్ మీడియాలోనూ వార్త పతాక శీర్షకలకెక్కడంతో ఇటు రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలోనూ వేడి పెరిగింది.

మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఆదుకోవాలని రాష్ట్రానికి ఆహ్లువాలియా సూచన

మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఆదుకోవాలని రాష్ట్రానికి ఆహ్లువాలియా సూచన

కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి ఆహ్లువాలియాను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కలుసుకుని మిర్చి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఆయన అభ్యర్థించిన తర్వాతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద జోక్యం చేసుకుంటామని, నిధులు కేటాయిస్తామని.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలని ఆదేశాలిస్తామని చెప్పారు.

ప్రతిఫలం ఇవ్వని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

ప్రతిఫలం ఇవ్వని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

ఇంతకుముందు అధికార టీఆర్ఎస్ ఎంపీలు వినోద్ కుమార్ తదితరులు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద జోక్యం చేసుకోవాలని కోరితే మాట మాత్రంగా అలా చేస్తే సగం వాటా భరిస్తామని చెప్పిందే తప్పా.. ఆచరణలో అధికారిక ఉత్తర్వులేమీ జారీచేయలేదు. కానీ ఈ సంగతులేమీ తెలియని రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు ఆదివారం ముఖాలకు నల్లబట్ట కట్టుకుని నిరసన ప్రదర్శన చేయగలిగారే గానీ ఆచరణలో మిర్చి రైతుల కడగళ్లు తీర్చేందుకు చర్యలు చేపట్టలేదన్న విమర్శలు మూటగట్టుకున్నారని తెలుస్తున్నది.

కంఠశోషగానే మిగిలిన తెలంగాణ అధికారుల విన్నపం

కంఠశోషగానే మిగిలిన తెలంగాణ అధికారుల విన్నపం

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మాట్లాడినప్పుడే ‘టీం ఇండియా' నినాదంతో సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. జాతి ప్రగతికి అంతా కలిసి రావాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ మూడో పాలక మండలి సమావేశంలోనూ అదే నినాదాన్ని ముందుకు తెచ్చారు. కానీ మిర్చి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కించారన్న విషయమై చెప్పేవారే కరువయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై మిర్చి రైతులను ఆదుకోవాల్సిన చర్యలపై ద్రుష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ అధికారులు చేసిన విన్నపం కేవలం కంఠశోషగానే మిగిలిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకుండా కేవలం ప్రచారార్భాటంతో కూడిన వ్యాఖ్యలతో ప్రజల మనస్సులు చూరగొనడం అంత తేలిక కాదని విమర్శకులు అభిప్రాయ పడ్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+