ఎప్పుడు చేరామన్నది కాదు: గెలిచామా? లేదా?
హైదరాబాద్: జీహెచ్ఎంస్ ఎన్నికల్లో కొందరు అభ్యర్ధులు చివరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి టికెట్ సాధించి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యం' అని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో పలువురు కొత్తనేతల్ని పార్టీలో చేర్చుకున్న ఆధికార పార్టీ టిక్కెట్లను ఖరారు చేసింది. మరికొందరు వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ను సాధించారు. ఇలా చివరి నిమిషంలో అధికార పార్టీలో చేరి గెలిచిన అభ్యర్ధుల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
చివరి నిమిషంలో టీఅర్ఎస్లో చేరి గెలిచిన అభ్యర్ధులు:
* నేరేడ్మెట్ డివిజన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.హన్మంతరావు భార్య శ్రీదేవికి చివరి నిమిషంలో టికెట్ ఖరారైంది. గతనెల 17న టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆమెకు మరుసటి రోజే టికెట్ ఇవ్వగా గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించింది.
* అల్విన్కాలనీ అభ్యర్థిత్వానికి తొలుత టీఆర్ఎస్ అభ్యర్ధి జాబితాలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కొమరగౌని శంకర్గౌడ్ కొడుకు వెంకటేశ్వర్గౌడ్ పేరు వెలువడింది. ఈయన తన నామినేషన్ పత్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తిరుగుబాటు(రెబెల్)గానైనా బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డ దొడ్ల వెంకటేశ్గౌడ్కు టికెట్ ఇవ్వడంతో విజయం సాధించాడు.
* చర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం తాడూరి శ్రీనివాస్, పారిశ్రామికవేత్త రఘుతోపాటు పలువురు పోటీపడ్డారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అనంతరం అనూహ్యంగా టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తెరపైకి వచ్చారు. అధిష్ఠానం ఆయనకు టికెట్ కేటాయించడంతో విజయం సాధించారు.
* టీడీపీ నుంచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి విజయరామారావు అనుచరుడు ఖాజా సూర్యనారాయణకు చివరి నిమిషంలో జూబ్లీహిల్స్ టికెట్ దక్కింది. దీంతో ఈయన కూడా విజయం సాధించారు.
* ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్ల టీఆర్ఎస్ అభ్యర్థిత్వాలు చివరి నిమిషంలో తారుమారయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన అనంతరం టీడీపీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్లు సామ రమణారెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ యువజన విభాగం అధ్యక్షుడు భవాని ప్రవీణ్ టీఆర్ఎస్లో చేరారు.
* దీంతో ఈ ముగ్గురికి అధిష్టానం చంపాపేట, వనస్థలిపురం, గడ్డిఅన్నారం టికెట్లను కేటాయించింది. దీంతో ఈ ముగ్గురూ ఎన్నికల్లో విజయం సాధించారు.
* కాంగ్రెస్ హఫీజ్పేట మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ టీఆర్ఎస్ డబుల్ ధమాకా సాధించారు. ఆయన చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి తనకు, తన భార్యకు కలిపి రెండు టికెట్లను దక్కించుకున్నారు. ఈ రెండు సీట్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
* గత పాలకవర్గంలో మెహిదీపట్నం డివిజన్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన బంగారి ప్రకాశ్ ఫ్లోర్లీడర్గా వ్యవహరించారు. ఈసారి పునర్విభజన నేపథ్యంలో గుడిమల్కాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో చివరి నిమిషంలో టీఆర్ఎస్లో గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు.