జగన్ ఎఫెక్ట్: హోదాపై మారిన చంద్రబాబు స్వరం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నారు. ప్రత్యేక హోదాపై తన స్వరం మార్చారు.
ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చేసిన ప్రకటనకు గతంలో అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందేనని అంటున్నారు. ప్రత్యేక హోదా వల్ల మాత్రమే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని జగన్ మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు.
ప్రత్యేక హోదాకు కట్టుబడే
ప్రత్యేక హోదాకు కట్టుబడే వైయస్ జగన్ తన కార్యాచరణను రూపొందించుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని ప్రకటించిన జగన్ వచ్చే నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు తన వైఖరిని స్పష్టం చేశారు.
వెనకబడిపోతామని చంద్రబాబు...
ఉండవల్లిలోని చందర్బాబు నివాసం సమీపంలోని ప్రజా దర్బార్ హాల్లో మంగళవారం టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా నినాదాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల్లోకి తీసుకుని వెళ్తోంది. మరోవైపు అది దాదాపు ప్రజల్లో సెంటిమెంట్గా మారింది. దాంతో హోదాను పక్కన పెడితే వెనకబడి పోతామనే అభిప్రాయాన్ని సమావేశంలో చంద్రబాబు వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఈ స్థితిలో అవిశ్వాసాన్ని పెట్టలేం....
ప్రభుత్వంలో కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిదించలేమని చంద్రబాబు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అవిశ్వాసం ప్రతిపాదించినా ప్రయోజనం ఉండదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన చెప్పినట్లు సమాచారం. బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించాలని కూడా ఆయన నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్పై ఎదురుదాడి చేస్తూనే....
ప్రత్యేక హోదా పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరనే విషయాన్ని లేవనెత్తుదామని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. రాజకీయంగా జగన్ ప్రయోజనం పొందకుండా చూడాలనే వ్యూహంతో ముందడుగు వేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఆయన నాయకులకు సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
మరింత కాలం పొడగిస్తున్నప్పుడు...
ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దాన్ని మరింత కాలం పొడగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణమేమిటనే కోణంలో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. మనం ప్రత్యేక హోదా వదిలేసినట్లు, తానేదో పొడిచేస్తున్నట్లు జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నట్లు కూడా తెలుస్తోంది.