వందో టెస్టుతోనే హర్భజన్ ఖేల్ ఖతం?
చెన్నై: వందో టెస్టు మ్యాచుతోనే హర్భజన్ సింగ్ ఖేల్ ఖతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో భజ్జీ ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్సులో అతి కష్టం మీద హర్భజన్ సింగ్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. అదే రవీంద్ర జడేజాకు కనీసం రెండు వికెట్లు దక్కాయి. జడేజా బ్యాటింగ్ కూడా ధాటిగానే చేయగలడు. దీంతో జడేజాకు జట్టులో స్థానం సుస్థిరం కావచ్చు.
కాగా, హర్భజన్కు తుది జట్టులో స్థానం కల్పించడానికి హైదరాబాదుకు చెందిన ప్రజ్ఞాన్ ఓజాను పక్కన కూర్చోబెట్టారు. నిజానికి, టెస్టు మ్యాచుల్లో ఓజా ఆటతీరు బాగుంది. ఆస్ట్రేలియాపై హర్భజన్ సింగ్ రికార్డు గతంలో బాగుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తుది జట్టులో అతనికి స్థానం కల్పించడానికి ఓ కారణం కాగా వందో టెస్టు ఆడకుండా అడ్డుకుంటారనే అపవాదు నుంచి బయటపడాలనే ఉద్దేశం మరో కారణం.
ఆస్ట్రేలియా బ్యాటింగును బెదరగొట్టడంలో హర్భజన్ సింగ్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్సులో అశ్విన్ ఏడు వికెట్లు పడగొడితే అనుభవజ్ఞుడైన భజ్జీ చేతులెత్తేశాడు. రెండో ఇన్నింగ్సులో భజ్జీ అనూహ్యమైన ప్రదర్శన చూపిస్తే తప్ప రెండో టెస్టులో ఆడే అవకాశం భజ్జీకి ఉండదని అంటున్నారు.

హర్భజన్ తన ఆటతీరు బాగా లేకపోవడంతో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్కు ఎంపికయ్యాడు. రికీ పాంటింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ గుండెల్లో గుబులు పుట్టించిన హర్భజన్ అతి సాధారమైన బౌలర్ స్థాయికి చేరుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications