వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు - సీఎం స్పందించాలి : తలసాని డిమాండ్..!!
మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరణతో ఆగిపోయిందనుకున్న వివాదం ఇంకా కొనసాగుతోంది. ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య రాజకీయంగా దుమారం రేపాయి. కేటీఆర్ ఏపీలో రోడ్లు - విద్యుత్ - నీళ్ల సంగతి పైన చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. అయితే, రాత్రి పొద్దు పోయిన తరువాత కేటీఆర్ ఒక ట్వీట్ చేసారు. అందులో తాను ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.
ఏపీ సీఎం జగన్ తనక సోదర సమానుడుగా పేర్కొన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ పురోగమించాలని ఆకాంక్షించారు. తన వ్యాఖ్యలతో ఏపీలోని తన సోదరులకు బాధ కలిగించటం తన ఉద్దేశం కాదని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు మంత్రి తలసాని దీని పైన స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని కాకుండా ప్రపంచ దేశాలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అనవసరంగా వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని పేర్కొన్నారు.
ఏపీని తమ కంటే అభివృద్ధి చేస్తే సంతోషమని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్థ రహితమని, బొత్స హైదరాబాద్ వస్తే ఎప్పుడు జనరేటర్ వినియోగించారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఏపీలో పవర్ కట్పై వాళ్ళే బహిరంగంగా ప్రకటించుకున్నారని చెప్పారు. వైసీపీ నేతల మాటలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఏపీకి వచ్చి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూడాలంటూ ఏపీ మంత్రులు కోరారు. మంత్రి రోజా తాను కేటీఆర్ కు ఏపీ మొత్తం తిప్పి ఏం జరుగుతుందో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.
ఒక్క సారిగా తెర మీదకు వచ్చి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ మంత్రులు..తాజాగా కేటీఆర్ వివరణ తరువాత ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో..ఈ వివాదం ఒక ముగిసిందని అందరూ భావించారు. సడన్ గా తిరిగి తలసాని చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరింత కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు మంత్రి తలసాని నేరుగా సీఎం స్పందించాలని డిమాండ్ చేస్తుండటంతో..మరోసారి వైసీపీ మంత్రులు దీని పైన స్పందిస్తారా..లేక, కేటీఆర్ ఇచ్చిన వివరణతో ఈ అంశాన్ని ముగిస్తారా అనేది చూడాల్సి ఉంది.