రజనీ కూడా రాజకీయాల్లోకి: చిరు
చిత్తూరు: తెలంగాణ పర్యటనలో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ కల్లు తాగడాన్ని చిరంజీవి సమర్థించారు. కల్లు ఇవ్వడం తెలంగాణా ఆచారంగా వర్ణించారు. దానిని తాగకపోతే తెలంగాణావాసులు బాధపడతారనీ, అందుకే పవన్ కళ్యాణ్ కల్లుతాగారని వివరించారు. కాగాతమిళసూపర్ స్టార్ రజనీకాంత్ తన 60వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చిరంజీవి వెల్లడిం చారు. ఈ మేరకు రజనీకాంత్ హామీ ఇచ్చారని చెప్పారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ముడుపులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధిష్ఠానాన్నే కమాండ్ చేయగలుగుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. నాలుగు రోజులపాటు చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఆదివారం చిత్తూరు బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టుల పేరుతో భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతుందని చిరంజీవి ఆరోపించారు.
రాత్రికి రాత్రే అంచనాలను పెంచి ఆ డబ్బులను ముడుపులుగా అధిష్ఠానానికి చేరవేస్తోందని ఆరోపించారు. ముడుపులు అందుకుంటున్న అధిష్ఠానం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని నియంత్రించలేక పోతోందనీ, రాజశేఖరరెడ్డే అధిష్ఠానాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడిందనీ అన్నారు. ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకొనేవారని తెలిపారు. సోనియాగాంధి ముడుపులు అందుకుంటూ అవినీతి ముఖ్యమంత్రిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.