చిరుకు ఇక బ్రదర్స్ దూరం
పార్టీ ఆవిర్భావానికి ముందు సన్నాహాక వ్యవహారాలన్నీ నాగబాబు చేతుల మీదుగా సాగాయి. ప్రతి జిల్లాలోనూ ఆయన విస్తృతంగా పర్యటించారు. హైదరాబాద్ లో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. అభిమాన సంఘాల కార్యకలాపాలను చక్కబెట్టారు. పార్టీ అధినేత చిరంజీవి సందేశాన్ని ఆయనే వినిపిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.
యువతను కూడగట్టడంలోనే కాకుండా చిరంజీవికి రక్షణ కల్పించడంలో పవన్ కల్యాణ్ ది ఆయన పార్టీ అనుబంధ సంఘాల్లో కీలకమైన యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించారు. తాను ఎంపిక చేసిన కొంత మందిని పార్టీలోకి, యువరాజ్యంలోకి తీసుకొచ్చారు. వారికి కీలక బాధ్యతలు అప్పగించేలా చూశారు. రాష్ట్రంలో పలుజిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో అంతా తానై వ్యవహరించారు. సినీరంగంలో ప్రముఖ హీరో అయినప్పటికీ కొంతకాలంపాటు షూటింగ్లకు దూరమై పార్టీకే అంకితమయ్యారు. తొలుత పార్టీపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ సభ్యులుగా నాగబాబు, పవన్ కల్యాణ్ లు వ్యవహరించారు. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తర్వాత వీరిద్దరూ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇక పూర్తిగా ప్రజారాజ్యం పార్టీకి దూరంగానే ఉంటారనే వార్తలు వస్తున్నాయి. వారు పార్టీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఒక ప్రముఖ దిన పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.