ఎమ్మెల్యేపై అత్యాచారం, హత్య కేసులు
ఏలూరు: నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలతో చెలరేగిన వివాదంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తెలుగుదేశం శాసనసభ్యుడు టీవీ రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీవీ రామారావుపై పోలీసులు అత్యాచారం, హత్య కింద కేసులు నమోదు చేశారు. నిదడవోలులోని టీవీఆర్ నర్సింగ్ కళాశాలకు (ఇది ఎమ్మెల్యే సొంత కళాశాల) చెందిన ఓ కేరళ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, ఆ తర్వాత ఆమె అదృశ్యమైందని గురువారం రాత్రి ప్రచారం జరిగింది. ఆమెపై అత్యాచారం చేసి, హతమార్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు ఆర్డీవో కృష్ణ, డీఎస్పీ వెంకంటరామిరెడ్డి కళాశాలకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థానికులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకున్నారు.
అక్కడ పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే రామారావు కళాశాల భవనం పైనున్న వాటర్ట్యాంకులో దాక్కున్నట్లు కొందరు గుర్తించారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండుచేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ గురువారం అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల బయట గుమిగూడిన ప్రజలను గానీ, మీడియాను గానీ లోపలకు రానివ్వకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. అదే సమయంలో నిడదవోలు ఎస్ఐ కూడా వెళ్లి విషయం తెలుసుకునేందుకు విఫలయత్నం చేశారు. పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు కళాశాలలో ఉన్న విద్యార్థినుల నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రెండు గంటలపాటు అక్కడ హైడ్రామా నడిచింది. ఇంతలో కళాశాల వెలుపల రక్తపు మరకలు ఉన్నట్లు కొందరు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్డీవో పరిశీలించి నమూనాలు సేకరించాలని ఆదేశించారు. విద్యాసంస్థకు అధిపతి అయిన ఎమ్మెల్యే టీవీ రామారావును అరెస్టు చేయాల్సిందిగా కోరుతూ దళితసంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే అక్కడున్నట్లు గుర్తించడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని నిడదవోలు పోలీసుస్టేషన్కు తరలించారు.