సోంపేట ఎన్ సిసి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు తాత్కాలిక బ్రేక్
శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన విద్యుత్తు ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీచేయడాన్ని సవాల్చేస్తూ ఎన్ఈఏఏలో ఏడు కేసులు దాఖలయ్యాయి. సోంపేటకు చెందిన న్యాయవాది టి.మోహన్రావు, గొల్లగండి ఎంపీటీసీ సభ్యుడు మద్దురాజారావు, విశాఖకు చెందిన ఫోరంఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, ఈమని అనంత సత్యనారాయణ శర్మ, సోంపేటకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంఘం, దొన్ను బెహర, సంధి కామరాజు విడివిడిగా వాటిని దాఖలుచేశారు. ఇందులో కేంద్ర పర్యావరణ-అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఏపీఐఐసీ, రెవెన్యూశాఖ కమిషనర్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఏడు అప్పీళ్లను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న అంశంపై మార్చి 8, ఏప్రిల్ 1, మే 13వ తేదీల్లో వాదనలు విన్న ఎన్ఈఏఏ.. చివరకు అన్నింటినీ కలిపి మెరిట్ ప్రాతిపదికన విచారించడానికి పచ్చజెండా ఊపింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు విన్న అనంతరం మే 29న చిత్తడినేలల నిపుణుడు, కేంద్ర పర్యావరణ అటవీశాఖ డైరెక్టర్ ఎస్.కౌల్ నేతృత్వంలో క్షేత్ర పరిశీలనకు వెళ్లింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి స్థానిక ప్రజలతో చర్చించింది.