నల్గొండతో కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్?
1956 అక్టోబర్ కు ముందు ఉన్న తెలంగాణ మాకు కావాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం మా పక్షాన ఉన్నది కాబట్టి మేం తీవ్రస్థాయిలో పోరాడుతున్నామన్నరు. 1956కు ముందు కర్నూల్ ఆంధ్ర రాజధానిగాఉన్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటామని, మీ బడ్జెట్ మీకు ఇస్తామని చెప్పిన ఆంధ్రా నాయకులు ఇప్పుడు సొచ్చేదాక సోమలింగం సొచ్చినంక రామలింగం అన్నట్టు వ్యవహరిస్తూ ఉద్యోగాలు, నీళ్లు అన్నీ వారే అనుభవిస్తున్నారన్నారు. ఆంధ్ర నీరు, ఉద్యోగాలు మాకు అవసరం లేదు. మా తెలంగాణ మాకు ఇస్తే చాలన్నారు. అప్పుడు ఏర్పాటు చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందంతో పాటు అన్ని ఒప్పందాలనూ వారు తుంగలో తొక్కి పడేశారన్నారు.
ఆంధ్రవాళ్లు ఆధిపత్యంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఏమీ లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, అసెంబ్లీలతో పాటు పలు వసతులు అన్నీ ఆంధ్రవాళ్లు రాకముందే తెలంగాణలో ఉన్నాయని గుర్తు చేశారు. ఆంధ్రవారు ఇన్నేళ్లలో ఒక్క రైల్వై స్టేషన్ నిర్మించింది లేదన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణ తల లేని మొండెంలా ఉంటుందన్నారు. హైదరాబాదును విడదీస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. ఆంధ్రోళ్ల భూమి ఒక ఇంచు కూడా మాకు వద్దు. మాది వాళ్లకు ఇవ్వమని కరాఖండిగా చెప్పారు.
పాండిచ్చేరి, ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహిస్తూ రాష్ట్రాలుగా మారుస్తుంటే రాష్ట్రంగా ఉన్న హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మేం మంది సొమ్ము అడగటం లేదు. ఇప్పటి వరకు ఆంధ్రవాళ్ల పాలనలో మే అభివృద్ది చెందలేదు. మా రాష్ట్రం మాకిస్తే అభివృద్ది చేసుకుంటామన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలుసుకున్న ప్రజలు వేలు లక్షల్లో మహిళలతో సహా అందరూ మాతృభూమి విముక్తి కోసం పార్టీలోకి చేరుతున్నారన్నారు. తెలుగు దేశం, ప్రజారాజ్యం పార్టీలు ఆంధ్రా పార్టీలు అనే విషయం అందరికీ అర్ధమయిందన్నారు. మన పోరాటం రాజకీయాల కోసం కాదని, తెలంగాణ కోసమేనని మిగిలిన వాళ్లందరికి తెలియజేసి వారికి సర్ది చెప్పి తెరాసలోకి ఆహ్వానించాలను పార్టీలో చేరిన వారికి చంద్రశేఖరరావు సూచించారు.