పరిటాల, సూరి ఇద్దరూ ఇద్దరే: వారికి ఇద్దరేసి నమ్మకస్థులు
పరిటాల రవికి అత్యంత సన్నిహితుడైన పోతుల సురేష్ ఆర్వోసీ పేరిట ఒక సంస్థను నిర్వహిస్తూ అజ్ఞాతం నుంచే పనిచేశాడు. మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలానికి చెందిన ఆయనకు పీపుల్స్వార్లో ఉన్న సమయంలో రవితో పరిచయమైంది. వ్యూహాలు రూపొందించటంలో సహకారం అందించే ఆయన జిల్లాలో జరిగిన పలు హత్యల వెనుక ఉన్నారనే ఆరోపణలున్నాయి. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో భవిష్యత్తు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్న సురేష్ ఆచూకీని ఎట్టకేలకు ఇటీవల పోలీసులు గుర్తించారు. గుజరాత్లో ఉన్న అతడిని గత నవంబరులో అరెస్టు చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సురేష్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు.
రవికి మరో ప్రధాన అనుచరుడుగా ఉన్న చమన్ మావోయిస్టు సానుభూతిపరుడు. ఇతడు పరిటాల సొంత గ్రామానికి సమీపంలోని కొత్తపల్లికి చెందిన వ్యక్తి. రవిపై ఆరోపణలు వచ్చిన హత్య కేసుల్లో ఇతడి ప్రమేయం ఉందన్న భావన పోలీసుల్లో ఉంది. రవికి వ్యక్తిగత వ్యూహకర్తగా చమన్ వ్యవహరించినట్లు చెబుతారు. చమన్ పలు కేసుల్లో నిందితుడిగానూ ఉన్నాడు. 2004లోనే అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నదీ తెలియలేదు.
ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో భానుకిరణ్ పదేళ్ల క్రితమే హైదరాబాద్ పోలీసులకు దొరికాడు. దీంతో అతడిని చర్లపల్లి జైలుకి తరలించారు. అప్పుడే సూరితో అతడికి సాన్నిహిత్యం ఏర్పడినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు భాను స్వగ్రామం. అతడి తల్లి వైద్యశాఖలో ఉద్యోగి. ప్రస్తుతం భాను తన తల్లితో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. సూరి కదలికలన్నీ భానుకే ఎక్కువగా తెలుస్తాయి. సూరి సెటిల్మెంట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ భాను ద్వారానే జరిగేవని తెలుస్తోంది. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుని రహస్యంగా సూరికి చేర్చే క్రమంలోనూ భాను కీలకపాత్ర పోషించేవాడని సమాచారం.
సూరి ప్రధాన అనుచరుల్లో మరో కీలకవ్యక్తి మధుసూదన్రెడ్డిది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని యర్లంపల్లి. ఇతడు సూరి కారు డ్రైవరుగా వ్యవహరిస్తాడు. కేశవరెడ్డి, సౌభాగ్యమ్మల పెద్ద కొడుకైన మధు జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో నిందితుడు. సూరి జైల్లో ఉన్న సమయంలో హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈ వ్యాపారంలో కీలకంగా వ్యవహరించేవాడు.