చంద్రబాబుకు కడప షాక్, టిడిపికి కందుల సోదరులు గుడ్బై యోచన
కందుల సోదరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కడప నుంచి కందుల రాజమోహన్ రెడ్డిని పోటీకి దించే ఆలోచన కూడా కాంగ్రెసు నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, కందుల సోదరులతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి చర్చలు జరిపారు. పార్టీని వీడిపోవద్దని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తమకు రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ ఇచ్చినా కూడా తాము తెలుగుదేశంలో ఉండేది లేదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కందుల సోదరులతో మరో వైపు కాంగ్రెసు నాయకులు చర్చలు జరుపుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కందుల సోదరులతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెసులోకి రావాలని ఆయన వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమకు చెందిన రామచంద్రయ్య టిడిపి నుంచే ప్రజారాజ్యంలోకి వచ్చారు. టిడిపిలో నెలకొన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని కందుల సోదరులను కాంగ్రెసులోకి తెచ్చే ప్రయత్నాలను ఆయన సాగిస్తున్నారు. కాగా, కడప లోకసభ అభ్యర్థి ఎంపిక కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన కడప కాంగ్రెసు నాయకుల సమావేశం ముగిసింది. అభ్యర్థిని ఖరారు చేయకుండానే సమావేశం ముగిసింది. అభ్యర్థి ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రికి అప్పగించామని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసి రెడ్డి చెప్పారు. తిరిగి సమావేశం బుధవారం సాయంత్రానికి వాయిదా పడింది. కందుల సోదరులు కాంగ్రెసులోకి వస్తామని కచ్చితంగా హామీ ఇస్తే సాయంత్రం కడప అభ్యర్థిపై కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.