తెలంగాణపై తేల్చేసిన హైకమాండ్, ఇవ్వలేమని స్పష్టం
తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాల వల్ల యుపిఎ ప్రభుత్వానికి ముప్పు లేదని గులాం నబీ ఆజాద్ అనడం అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. వీలైనంత వరకు తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించే వ్యవహారాన్ని ముందుకు సాగించడమే కార్యాచరణగా ముందుకు సాగాలని సోనియా నుంచి అధిష్టానం పెద్దలకు సూచనలు అందినట్లు చెబుతున్నారు. అధిష్టానం తమ మాటలను కనీసం కూడా వినడానికి సిద్ధంగా లేదని, రాజీనామాలు ఉపసంహరించుకోవాలని చెప్పడం తప్ప తెలంగాణపై హామీ ఇవ్వడం లేదని అనుభవం ద్వారా తెలుసుకున్న పార్లమెంటు సభ్యులు గులాం నబీ ఆజాద్ సమావేశాన్ని కూడా బహిష్కరించారు.
పార్టీ అధిష్టానం నుంచి ఏ విధమైన సానుకూలత వ్యక్తం కాకపోవడంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సహా మరికొంత మంది రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరు కూడా అధిష్టానం వైఖరిని బయట పెడుతోంది. కాంగ్రెసు నాయకత్వంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మొదటి ముద్దాయి కాంగ్రెసు పార్టీయే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు.