సోనియాకు తెలంగాణ ఉచ్చు, చంద్రబాబుకు ఊరట
తెలుగుదేశం సీమాంధ్ర నాయకుల్లో విజయవాడకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు తప్ప ఎవరు కూడా తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇప్పుడిప్పుడే సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు నోరెత్తుతున్నారు. కాంగ్రెసు ఎలా బయటపడుతుందో చూడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు సీమాంధ్ర నాయకులను సైలెంట్ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు నాయకులతో పాటు నాగం జనార్దన్ రెడ్డి ఇప్పటి వరకు చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం పార్టీ మనుగడను తెలంగాణ ప్రాంతంలో తుడిచిపెట్టడానికి వ్యూహాత్మకంగా కదిలారు. దానికి విరుగుడుగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలను చంద్రబాబు ముందుకు తెచ్చారు.
తెలంగాణ విషయంపై చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడడం లేదు. కాంగ్రెసు అధిష్టానం బయటపడితే చూద్దామని వేచి చూసే ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. దాని నుంచి బయటపడడం సులభం కాదని కూడా ఆయన భావిస్తున్నారని అంటున్నారు. బంతి మొత్తం మీద కాంగ్రెసు అధిష్టానం కోర్టులో ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశమనే చెప్పాలి.