చిదంబరం మెడకు 2జి ఉచ్చు?
చిదంబరంతో పాటు 2జీ స్కామ్లో నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్, అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిల పాత్రపైన కూడా దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ గురువారం దాఖలు అయింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఈ పిటిషన్ను వేసింది. 2జి లైసెన్స్ల కేటాయింపు ఒప్పందంలో నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇన్ఫోకమ్ సంస్థ నుంచి రూ.650 కోట్ల జరిమానాను వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 కోట్ల జరిమానాను మాత్రమే టెలికం మంత్రిగా సిబల్ వసూలు చేశారని ఈ ఎన్జీవో ఆరోపించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే సిబల్ ఇలా తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సిబల్ పాత్రపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలి'' అని కోర్టును సదరు ఎన్జీవో కోరింది.
తమ ఆరోపణలకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను కోర్టుకు ఎన్జీవో నిర్వాహకులు సమర్పించారు. అంతేగాకుండా అటార్నీ జనరల్ వాహనవతి పాత్రపైన కూడా దర్యాప్తు చేయించాలంటూ కోర్టును పిటిషన్దారు కోరారు. యుపిఏ-1 హయాంలో సొలిసిటర్ జనరల్గా ఉన్న వాహనవతి 2జీ కేటాయింపుల అంశంపై నాటి కేంద్ర టెలికం మంత్రి ఎ.రాజాకు న్యాయ సలహాలు ఇచ్చిన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారన్నది పిటిషన్దారు అభియోగం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ మంత్రిత్వ శాఖ అయినా తనకు సంబంధించిన అంశాలపై న్యాయపరమైన సందేహాలు కలిగినప్పుడు వాటిని న్యాయశాఖకు నివేదించాలి. అలా నివేదించాక మాత్రమే సంబంధిత న్యాయాధికారులు తమ సలహాను ఆయా ప్రభుత్వ శాఖలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాజాకు న్యాయ సలహాలు ఇచ్చే విషయంలో వాహనవతి ఈ నిబంధనను ఖాతరు చేయలేదని అభియోగం. కాగా పిటిషన్ ఈ నెల 11న విచారణకు రానుంది.