కర్ణాటక సిఎం యడ్యూరప్పకు ఉద్వాసన, కాంగ్రెసు టార్గెట్
మార్షియస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే యడ్యూరప్పతో బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడుతానని యడ్యూరప్ప నితిన్ గడ్కరీతో చెప్పినట్లు సమాచారం. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేయాలంటే అది తప్పని, యడ్యూరప్పను కొనసాగిస్తే తమపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తాయని బిజెపి నాయకత్వం అనుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, రాష్ట్ర పార్టీ చీఫ్ కెఎస్ ఈశ్వరప్ప, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో యడ్యూరప్ప మాట కీలకం కానుంది.
లోకాయుక్త నివేదిక ఆధారంగానే కర్ణాటక నాయకత్వంపై తమ నిర్ణయం ఉంటుందని గడ్కరీ చెప్పారు. పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ కూడా యడ్యూరప్పను తొలగించడమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. అధికార మార్పిడి ప్రశాంతంగా జరగడానికి యడ్యూరప్ప అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.