యడ్యూరప్పకే గాలి బ్రదర్స్ మద్దతు, కొత్త డ్రామా
కాగా, యడ్యూరప్ప తాను ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లు కనిపించకుండానే ఆయన రాజకీయం నడుపుతున్నట్లు అర్థమవుతోంది. శనివారం సాయంత్రం గాలి బ్రదర్స్ వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు, యడ్యూరప్ప వర్గానికి చెందిన దాదాపు 74 మంది శాసనసభ్యులు పార్టీ అధిష్టానం పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలను కలిసి యడ్యూరప్పకు మద్దతు ప్రకటించారు. యడ్యూరప్ప పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తూనే వెలుపలి నుంచి రాజకీయం నడుపుతున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వానికి ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభంగా ఏమీ కనిపించడం లేదు. ఆదివారం మధ్యాహ్నానికి పరిస్థితి ఎలా మారుతుందో కూడా చెప్పలేని స్థితి.
మరో వైపు సదానంద గౌడను ముఖ్యమంత్రిని చేస్తానంటే తాను అంగీకరిస్తానని యడ్యూరప్ప చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. యడ్యూరప్ప మాటలను గానీ తాజా పరిణామాలను గానీ సాఫీగా అర్థం చేసుకోవడానికి వీలు లేని వాతావరణం బెంగళూర్లో నెలకొంది. క్షణక్షణానికీ రాజకీయాలు మారిపోతున్నాయి. బిజెపి అధిష్టానాన్ని గౌరవిస్తున్నట్లు కనిపిస్తూనే తిరుగుబాటుకు కావాల్సిన వ్యూహాన్ని యడ్యూరప్ప వర్గం అనుసరిస్తోంది. ఒక రకంగా బిజెపి అధిష్టానాన్ని ఇరకాటంలో పెడుతోంది.