వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ నివేదిక రెడీ
పూర్తిస్థాయి దర్యాప్తునకు హైకోర్టు అనుమతిస్తే మలేసియా కోణం వైపు సీబీఐ పరుగులు తీయనుంది. తొలిదశ ప్రాథమిక విచారణలో జగన్ కంపెనీల డొంకను కదిలించిన సిబిఐ రెండోదశ విచారణలో ఆ కంపెనీల పెట్టుబడుల మూలాల్లోకి చొచ్చుకుని పోయింది. దీంతో జగన్ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో అత్యధికులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందిన వారేననే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదే విషయాన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలతో నిర్ధారించుకోవడానికి సిబిఐ యత్నించింది. ఇదే క్రమంలో పలు బ్యాంకుల నుంచి సిబిఐ అధికారులు కీలక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వ్యక్తుల ఆదాయపు ట్రాక్ రికార్డును పరిశీలించడానికి ఆదాయపు పన్నుశాఖ సాయాన్ని కూడా సిబిఐ అధికారులు తీసుకున్నారు. ఈ క్రమంలో డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, కేంద్ర నిఘా సంస్థ నుంచి సిబిఐ కొన్ని వివరాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.
వీరితో పాటు వైఎస్ జమానాలో కీలక హోదాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, వివిధ హోదాల్లోని ప్రభుత్వ అధికారుల నుంచి సిబిఐ అధికారులు స్టేట్మెంట్లు రికార్డు చేశారని సమాచారం. ఎపిఐఐసి, ఏపిఎండిసి, మైనింగ్, పరిశ్రమలు, రెవెన్యూ, ఓడరేవులు తదితర ప్రభుత్వ విభాగాల నుంచి భూముల కేటాయింపులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలు, నోట్ఫైల్స్ను సిబిఐ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టుల కేటాయింపు మార్గదర్శకాలను పాటించకుండా అడ్డగోలుగా కేటాయింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అనేక సాక్ష్యాధారాలను సిబిఐ సేకరించింది. ఇప్పటి వరకు సిబిఐ అధికారులు ముప్పై అయిదుకు పైగా కంపెనీలు, వ్యక్తుల నుంచి జగన్ ఆస్తులకు సంబంధించిన వివరాలు, వాంగ్మూలాలు సేకరించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల ప్రతినిధుల్లో చాలా మంది వరకు తాము లాభాలను ఆశించి పెట్టుబడులు పెట్టామని సిబిఐకి చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కోటి రూపాయల పెట్టుబడి నుంచి వందలకోట్ల పెట్టుబడులు వరకు పెట్టిన వారిని సిబిఐ అధికారులు విచారించారు.