అన్నాహాజారే కోసం: తీహార్కు భారీగా తరలిన ప్రజలు
ఈ సందర్భంగా స్వామి అగ్నివేష్, కిరణ్ బేడీ మాట్లాడారు. అన్నా కోసం అందరం ఎదురు చూస్తున్నామని ఆయన రాగానే అందరం కలిసి జెపి పార్కుకు వెళదామని ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అవినీతిని నిర్మూలించాల్సిందే అని వారు అన్నారు. కాగా లోక్సభలో ప్రధాని హజారే అరెస్టుపై ప్రకటన చేసిన అనంతరం సభాపతి మీరాకుమార్ చర్చకు అనుమతించారు. అయితే చర్చ సమయంలో ప్రధాని వెళ్లడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ప్రధాని వ్యాఖ్యలపై ఎల్కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లోక్సభ, రాజ్యసభలలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హజారే అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయన్నారు. హజారే దీక్షకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ఆయన దీక్ష ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని రోజులు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందా అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడటానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రధాని చర్చలో ఉండాలని విపక్షాలు పట్టుబట్టడంతో లోకసభ స్పీకర్ మీరాకుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అరగంట తర్వాత సభ ప్రారంభం అయింది.