లిబియా తిరుగుబాటుదారుల దెబ్బకు పారిపోయిన గడాఫీ

ప్రస్తుత పోరులో ఇరుపక్షాల వైపు 376 మంది మరణించగా, వెయ్యిమంది క్షతగాత్రులైనట్లు ఓ అధికారి తెలిపారు. తన పాలనకు అంతిమ ఘడియలు సమీపించాయన్న వాస్తవాన్ని గడాఫీ గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ ప్రకటనలో చెప్పారు.ఇప్పటికైనా పదవి వదిలితే మరింత రక్తపాతాన్ని నివారించవచ్చన్నారు. బ్రిటన్లో జప్తు చేసిన లిబియా ఆస్తుల్ని తిరుగుబాటుదారుల పాలన వచ్చాక విడుదల చేస్తామని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ప్రకటించారు.
గడాఫీ చిన్న కుమారుడు సైఫ్ అల్ఇస్లాంను తాము నిర్బంధించినట్లు తిరుగుబాటుదారుల జాతీయ పరివర్తన మండలి సమన్వయకర్త దబేచి ప్రకటించారు.
విచారణ నిమిత్తం గడాఫీని, సైఫ్ను హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించనున్నట్లు చెప్పారు. పెద్దకుమారుడు మొహమ్మద్ అల్గడాఫీ తిరుగుబాటు దళాలకు లొంగిపోయినట్లు దబేచి చెప్పారు. మరో కుమారుడు సాదీ కూడా బందీగా చిక్కినట్లు తెలుస్తోంది. అయితే.. పాలనలో కీలకమైన గడాఫీ బావమరిదితోపాటు, నిఘా సంస్థ అధిపతి ఆచూకీ తెలియడంలేదు. వారు మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. తిరుగుబాటుదారుల నేత ముస్తఫా అబ్దెల్ జలీల్ సోమవారం మాట్లాడుతూ - గడాఫీపై చట్టబద్ధంగా అన్ని న్యాయ హక్కులతో కూడిన విచారణ జరుగుతుందని హామీనిచ్చారు. ఆయన లొంగిపోరనీ, హిట్లర్లా ఆత్యహత్య చేసుకునేంత ధైర్యవంతుడూ కాదని అన్నారు.
గడాఫీ ఓ ఆస్పత్రిలో ఉన్నారని అల్అరేబియా ఛానెల్ తెలిపింది. అయితే, బీబీసీ ప్రకారం గడాఫీ తన స్థావరమైన ట్రిపోలిలోని బాబ్ అల్అజీజియా కాంపౌండ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గడాఫీ తన కాంపౌండ్లో నిర్మించుకున్న బంకర్లలో దాగి ఉండవచ్చని కొంతమంది చెబుతుండగా, గడాఫీ ఆయన కుటుంబ సభ్యులు కొందరు పొరుగు దేశం అల్జీరియాకు పారిపోయారని తిరుగుబాటుదారుల ప్రతినిధి ఒకరు వెల్లడించారు.












Click it and Unblock the Notifications