ఏడుగురు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు వెనక్కి?
రాజీనామాలపై వస్తున్న ప్రతికూలత వల్ల కూడా వారు పునరాలోచనలో పడినట్లు సమాచారం. కాగా, ఐదుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, వారి షరతులకు అంగీకరించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని తెలుస్తోంది. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు టికెట్ గ్యారంటీ ఇవ్వడానికి, ఎన్నికల ఖర్చులు భరించడానికి జగన్ హామీ ఇవ్వకపోవడమే కాకుండా సీనియర్ శాసనసభ్యులతో తప్ప జూనియర్లతో మాట్లాడడానికి కూడా జగన్ ఇష్టపడకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను ముగించుకుని జగన్ ఈ నెల 30వ తేదీన హైదరాబాదుకు వస్తారు. అప్పుడు శాసనసభ్యులతో, సీనియర్ నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్లో సిబిఐ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.