Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముఖ్యమంత్రి కుట్రలో చిరంజీవి, బొత్స పాత్ర: మందకృష్ణ

Manda Krishna Madiga
హైదరాబాద్: శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలిగించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి పాలు పంచుకున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డిని, బొత్స సత్యనారాయణను రాజకీయంగా సమాధి చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హెచ్చరించారు. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించడాన్ని రాజకీయ హత్యగా భావిస్తున్నామని ఆయన అన్నారు. కాపు, రెడ్డి ఆధిపత్య పోరులో దళితుడైన శంకరరావును బలి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నాయకత్వం అగ్ర వర్ణాల పక్షాన్నే ఉంటుందని, దళితుల పక్షాన ఉండదని రుజువైందని, కాంగ్రెసు పోయే రోజులు వచ్చాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో, ప్రభుత్వంలో, పార్టీలో ఆధిపత్యం కోసం కాపు, రెడ్డి వర్గాల రాజకీయ పోరాటంలో దళిత నాయకుడిని బలి చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. కాపు ఆధిపత్యం కోసం చిరంజీవి, బొత్స సత్యనారాయణ పోరాడితే, రెడ్డి ఆధిపత్యం కోసం కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం చేశారని, ఇద్దరు కూడా తమ పోరాటంలో విజయం సాధించారని ఆయన అన్నారు. తన వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి వర్గ విస్తరణను పరిమితం చేసుకోవడం ద్వారా బొత్స, చిరు విజయం సాధించారని, శంకరరావును బలి చేయడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారని ఆయన అన్నారు. శంకరరావుకు జరిగిన అవమానాన్ని తెలంగాణ దళితులను అవమానించినట్లుగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించిందని, అలా నిజంగానే భావిస్తే పోరాట కార్యక్రమం తీసుకోవాలని ఆయన అన్నారు.

శంకరరావుకు జరిగిన అన్యాయానికి నిరసనగా రేపు కలెక్టరేట్లను ముట్టడిస్తామని, 22వ తేదీన మండలాల్లో ధర్నాలు చేస్తామని, 23వ తేదీన రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణించి ఆందోళనలు చేస్తామని ఆయన చెప్పారు. 27వ తేదీన తాము ఇతర కుల సంఘాలతో సమావేశమైన కాంగ్రెసుపై దళితుల తిరుగుబాటును ప్రకటిస్తామని ఆయన చెప్పారు. చిరంజీవిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

సామాజిక న్యాయాన్ని సాధిస్తామని పార్టీ పెట్టిన చిరంజీవి కాంగ్రెసుకు వ్యతిరేకంగా నిలబడడం వల్లనే గత ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లు, 18 సీట్లు సాధించారని, ఇప్పుడు కాంగ్రెసులో చేరిన తర్వాత సామాజిక న్యాయానికి అర్థాన్నే మార్చేశారని ఆయన అన్నారు. సామాజిక న్యాయం అంటే కాపు వర్గానికి పదవులు ఇప్పించుకోవడమనే విషయాన్ని చిరంజీవి ఆచరణలో చూపించారని, కాపు వర్గానికి చెందినవారికే మంత్రి పదవులు ఇప్పించుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు తరఫున రేపు ఓట్లేయాలని వచ్చే చిరంజీవిని ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+