చిరు ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఓకే, కాపుపైనే తర్జన భర్జన!
దీంతో, ఈ విచారణకు వంగా గీత, కొండ్రులు మాత్రమే హాజరై, విప్ జారీచేసిన సాక్ష్యాలను ప్రవేశ పెట్టే అవకాశముంది. కాగా, విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఎందుకు ఓటు వేయాల్సి వచ్చిందో వివరిస్తూ తన రాజీనామా లేఖను స్పీకర్కు శోభా నాగి రెడ్డి పంపారు. ఆమె శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వంగా గీత ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అనర్హత వేటును ఎదుర్కొంటున్న శాసన సభ్యులు రాజీనామా చేస్తే వాటిని ఆమోదించడం పరిపాటి. విప్ను ధిక్కరించి ఓటు వేసిన జగన్ వర్గ ఎమ్మెల్యేలు 17 మందిలో శోభా నాగి రెడ్డి రాజీనామా చేసినందున ఆమె విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్కు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురుకాబోవని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరో 13 మంది విప్ తీసుకున్నట్టు అంగీకరించినందున వారి విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదంటున్నాయి. విప్ను స్వీకరించని ప్రసాదరాజు, చెన్నకేశవరెడ్డి సైతం, తమకు విప్ సమాచారం ఉందని అంగీకరిస్తున్నారు.
అయితే, కాపు రామచంద్రారెడ్డి మాత్రం విప్ అందలేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపునకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపాల్సిన బాధ్యత కొండ్రు మురళీపై పడింది. అసెంబ్లీలో పిఆర్పీ ఇప్పటి వరకు విలీనం కానందున శోభా నాగి రెడ్డి విషయంలో తర్జన భర్జన ఉంటుందేమోనని భావించినప్పటికీ ఆమె రాజీనామా చేసినందున ఎలాంటి సమస్య ఉండదంటున్నారు. దీంతో ఇప్పుడు కాపుదే ప్రభుత్వానికి సమస్యగా మారిందని చెప్పవచ్చు. మొత్తానికి గురువారంతో విచారణలు పూర్తయ్యే అవకాశముంది. మరో వారం రోజుల్లో శోభా నాగి రెడ్డి, కాపు సహా జగన్ వర్గ ఎమ్మెల్యేలందరి అనర్హతపై తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.