నాగర్కర్నూల్ వచ్చే దమ్ముందా: బాబుకు నాగం సవాల్
చంద్రబాబుకు తన నియోజకవర్గం నాగర్ కర్నూల్ కు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. కెసిఆర్, తాను వేరు పార్టీలు అయినప్పటికీ తెలంగాణవాదం తమను ఒక్కటి చేసిందన్నారు. ఫోరం నేతలంతా బాబు దగ్గర నెలమామూళ్లు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించి టిడిపి, కాంగ్రెసు డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు. పేరుకే రూపాయి కిలో బియ్యం కానీ ఉప్పు, పప్పు రేట్లు మాత్రం మండిపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్లో తెలంగాణవాదం లేరని అంటున్నారని కానీ కొల్లాపూర్ వస్తే ఆయనకు తెలుస్తుందన్నారు. తెలంగాణ ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడూ రాదన్నారు. తెలంగాణపై తీర్మానం పెట్టాలని అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన చంద్రబాబు సోనియా తెలంగాణ ప్రకటించాక డ్రామాలు ఆడటం ప్రారంభించారన్నారు. సీమాంధ్ర నేతలు అందుకు వంత పాడారన్నారు. తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాల్సి ఉందన్నారు.
ఎన్నికల కోసం తాను రాజీనామా చేయలేదని తెలంగాణ కోసమే రాజీనామా చేశానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందన్నరు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఇచ్చి మాట మేరకు తాను తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేస్తానని అన్నారు. మహబూబ్ నగర్కు తాను అడిగినన్ని నీళ్లు ఇస్తే తాను ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటానని చెప్పినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తానంటున్న నేతలు రెండేళ్లయినా రాజీనామాలు చేయడం లేదన్నారు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సిపిఐ నేతలు తదితరులు పాల్గొన్నారు.