వైయస్ బెదిరింపు: సారయ్యను కాదన్న దామోదర్ రెడ్డి
వైయస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 1998లో తాను తెలంగాణకు అనుకూలంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కోరుతూ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతి పత్రం ఇవ్వడాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి సిఎల్పీ నేతగా ప్రోత్సహించారని ఆయన చెప్పారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడలేదని, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నారని ఆయన అన్నారు. సారయ్యతో వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పారో తెలియదని ఆయన అన్నారు. తెలంగాణకు డెడ్లైన్లు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్ హయాంలోనే తాము తెలంగాణపై తమ వైఖని వెల్లడించామని ఆయన చెప్పారు. తాను తెలంగాణపై సమావేశం ఏర్పాటు చేస్తానంటే తనను వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని సారయ్య చెప్పారు.
కేంద్ర మంత్రి వాయలార్ రవితో మాట్లాడిన తర్వాత తెలంగాణపై తమకు కాస్తా నమ్మకం కలిగిందని దామోదర్ రెడ్డి అన్నారు. అయితే, ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అన్నారు. తాము ఎవరనీ అవమానించడం లేదని, తెలంగాణ కోసం మాత్రమే మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాత పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయాన్ని పాటిస్తోందని, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అందర్నీ సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.