టెక్కీ నీలిమ మృతి: మెయిల్తో వీడుతున్న మిస్టరీ
నీలిమది ఆత్మహత్యే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నీలిమ నుంచి చివరి కాల్ అందుకున్న వ్యక్తి ప్రశాంత్ విశాఖపట్నంలో ఉన్నట్లుగా ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించారు. ఆమె భర్త సురేష్ని విచారించారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.
వైవాహిక జీవితంపై అసంతృప్తితో ఉన్న నీలిమ తన భర్తతో కలిసి అమెరికా వెళ్లేలా పెద్దలు నిర్ణయించడంతో ఇక జీవితాన్ని చాలించాలనే భావనతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో గుడికి వెళుతున్నానని చెప్పిన నీలిమ ఇన్ఫోసిస్ కార్యాలయానికి చేరుకొని ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారని తెలుస్తోంది.
ప్రశాంత్తో మాట్లాడిన తర్వాత.. నీకు నాకు సరిపడదంటూ నీలిమ తన భర్తకు సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించారని సమాచారం. అనంతరం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. నీలిమ సెల్ ఫోన్ లోని డేటాని సేకరించిన పోలీసులు ఆమె ల్యాప్ టాప్లోని కీలక అంశాలను డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధరంగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో నీలిమ జూలై 31న రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. నీలిమ తన భర్తకు ఆఖరుగా మెయిల్ చేసింది. అందులో నీవు చాలా మంచివాడివని, నీ దారి వేరు... నా దారి వేరని, నీకు నాకు మ్యాచ్ కాలేదని, తనది సహజ మరణంగా భావించి, ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని, ఎవరితోనూ చెప్పవద్దని, పండూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని, అతనిని ఈ జన్మలో కలవలేనని తన భర్త సురేష్కు పంపిన ఆఖరి మెయిల్లో నీలిమ పేర్కొంది.