హై కమాండ్ వైఖరి: కళంకిత మంత్రుల్లో గుబులు
కళంకిత మంత్రులను రక్షించడానికి ప్రయత్నించడానికి బదులు చట్టం తన పని తాను చేసుకుని పోతుందని, అందులో తాము తలదూర్చబోమని చెప్పడానికే ఎక్కువ ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి క్లీన్ ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కళంకిత మంత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రాజీనామా చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా అది కంటి తుడుపు వరకేనని అంటున్నారు. వారిని మంత్రివర్గంలో కొనసాగనీయడం వల్ల పార్టీకి గానీ ప్రభుత్వానికి గానీ జరిగే మేలు ఏమీ లేకపోగా నష్టమే ఎక్కువ జరుగుతుందని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమంత్రి నచ్చజెప్పినప్పటికీ అధిష్టానం కఠినంగా ఉండడం వల్లనే ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేయక తప్పలేదని అంటున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో తప్పు చేసినట్లు తేలితే ఎవరినీ వదలకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రుల్లో కలవరం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరు మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేశారు. మరో నలుగురు మంత్రుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.
వైయస్ రాజశేఖర రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, దాంతో వైయస్ రాజశేఖర రెడ్డి తమతో ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయించుకునేవారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే, మంత్రులను కాపాడే ప్రయత్నాలు చేయకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉంది. 2జి స్కామ్, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాల కేసుల్లో డిఎంకె నేత కరుణానిధి కూతురు కనిమొళిని కూడా వదిలిపెట్టలేదు. అటువంటి స్థితిలో రాష్ట్రానికి చెందిన కళంకిత మంత్రులను కాపాడే ప్రశ్నే ఉదయించదని అంటున్నారు.
పార్టీ అధిష్టానం వైఖరితో మిగతా నలుగురు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి గుండెల్లో గుబులు రేగుతోంది. తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిలో మొదలైంది. తమ దాకా రాదని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.