దక్షిణాఫ్రికాలో పోలీసు కాల్పులు: 36 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని మారికానా ప్లాటినం గని వద్ద గురువారం సాయంత్రం.. స్థానిక కాలమానం ప్రకారం నాలుగు గంటల సమయంలో ఈ మారణకాండ జరిగింది.. తెల్లవారి పాలన నుంచి దక్షిణాఫ్రికా విముక్తి పొందాక జరిగిన అతిపెద్ద విషాదమిది. బంగారం కన్నా విలువైన ప్లాటినం గనులు ఈ ప్రాంతంలో కొల్లలుగా ఉన్నాయి. లండన్కు చెందిన లాన్మిన్ అనే కంపెనీ ఈ గనుల్లో తవ్వకాలకు అనుమతి పొందింది.
అయితే, ఇందులో పనిచేస్తున్న కార్మికులు తమకు ఇచ్చే వేతనాలు సరిపోవట్లేదని చాలా రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలను ప్రస్తుతం ఉన్నదాని కన్నా మూడింతల మేర పెంచాలని కోరుతూ ఆగస్టు 10వ తేదీ నుంచి పని మానేసి గనిలోంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. వారి ఆందోళన ఆగ్రహంగా మారింది. దీంతో, ఆగస్టు 14 నుంచి కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది.
ఈ పరిణామంతో మరింత ఆగ్రహం చెందిన కార్మికులు కత్తులు, కర్రలు, ఈటెలతో నిరసనకు దిగారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం అక్కడ పోలీసులను మోహరించింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. "మారణాయుధాలతో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు ఒక్క ఉదుటున ముందుకు దూసుకురావడంతో కాల్పులు జరపక తప్పలేదు'' అని పోలీసు కమిషనర్ రియా ఫియేగా వివరించారు.
ఈ కాల్పుల గురించి తెలియగానే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్జుమా తన మొజాంబిక్ పర్యటనను వాయిదా వేసుకుని అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ దేశ పోలీసు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మిన్సి మాత్రం - "ఆయుధాలతో, కరడుగట్టిన నేరస్థుల్లా పోలీసులను హతమార్చే పరిస్థితుల్లో పోలీసులు మాత్రం ఏం చేయగలరు?'' అని వ్యాఖ్యానించారు.