నేను సిఎంగా ఉండగా..: బాబు, విద్యార్థులు సహా అరెస్ట్
పేద విద్యార్థులను చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అర్హులైన వారికి ఫీజు రీయింబర్సుమెంట్సుకు దూరం చేయవద్దన్నారు. పదివేల ర్యాంకులు అనే సాకుతో విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు. తాను సిఎంగా ఉండగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే పాఠశాలలు, కళాశాలలు ఓపెన్ చేశామన్నారు. పిల్లలకు పోషకహారం లేకుండా అనారోగ్యం పాలవుతున్నారని మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. రీయింబర్సుమెంట్స్ ప్రారంభించింది తామే అన్నారు.
పేదల కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన అందరు విద్యార్థులకు రీయింబర్సుమెంట్స్ ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అందరినీ కన్ఫ్యూజన్కు గురి చేస్తోందని విమర్శించారు. టిడిపి హయాంలో క్యాంపక్ ఇంటర్వ్యూలు ఉండేవని, ఇప్పుడు ఉద్యోగాలు లేకుండానే పోయాయన్నారు. చదువుకోవడం విద్యార్థి హక్కు అని చదవించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.
టిడిపి జివో ఆధారంగానే వైయస్ కొత్త జివో రీయింబర్సుమెంట్సు పైన తీసుకు వచ్చారన్నారు. ఎవడబ్బ సొమ్మని బెయిల్కు కోట్ల రూపాయలు ఇస్తున్నారని మండిపడ్డారు. అవినీతి లేకుంటే అనేక పథకాలు సమర్థవంతంగా ప్రవేశ పెట్టవచ్చునని, బందుల పేరుతో విద్యార్థులను రోడ్డెక్కించవద్దని బాబు అన్నారు. కాగా చంద్రబాబు ర్యాలీగా ఎల్బీ నగర్లోని ధర్నా స్థలికి చేరుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని, విరమించుకోవాలని బాబుకు పోలీసులు చెప్పారు.
అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతామని చెప్పిన బాబు ఆందోళన కొనసాగించారు. అనంతరం కాసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి చంద్రబాబు సహా పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. వారిని వనస్థలిపురం పోలీసు స్టేషన్కి తరలించారు. తమ పార్టీ అధినేత విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే అరెస్టు చేయడమేమిటని, అయినా తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బాబుకు అరెస్టులు కొత్త కాదని, ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా ఆయన వెనుకాడరని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. బాబును అరెస్టు చేసే సమయంలో టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.