పిఆర్పీ రూట్లో: జగన్పై బాబు, గుడివాడ అభ్యర్థి రావినే
భారత రాజకీయ చరిత్రలో గుడివాడకు ప్రత్యేక స్థానముందని, ఎన్టీఆర్ ఎప్పుడు కాంగ్రెసుతో కలవలేదని, కాంగ్రెసు గుండెల్లో నిద్ర పోయింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. అలాంటి ఎన్టీఆర్ దారిలోనే మేం నడుస్తున్నామని, తమకు కాంగ్రెసుతో కుమ్మక్కు అయ్యే అవసరం లేదన్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం క్రమంగా కాంగ్రెసులో కలిసిపోయిందని అలాగే రాష్ట్రంలోని కొన్ని పార్టీలో కూడా కాంగ్రెసులో విలీనం కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి బాబు అన్నారు.
ఎన్టీఆర్ గుడివాడ నుండి పోటీ చేసినప్పుడు రావి తండ్రి ఆయన గెలుపు కోసం కృషి చేశారన్నారు. 2004లో కొన్ని కారణాల వల్ల రావికి టిక్కెట్ ఇవ్వలేదని, ఇచ్చి ఉంటే 2009లో టిడిపి గెలిచి ఉండేదన్నారు. వచ్చే ఎన్నికలలో తప్పకుండా టిక్కెట్ కేటాయిస్తామని చెప్పారు. రానున్నది టిడిపి ప్రభుత్వమే అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భారత దేశం గౌరవించే విధంగా ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కొందరు నేతలు అమ్ముడు పోతున్నారన్నారు.
అమ్ముడు పోయిన కార్యకర్తలను తిరిగి పార్టీలోనికి తీసుకునే ప్రసక్తి లేదన్నారు. నేతలు అమ్ముడుపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. కార్యకర్తల బలమే టిడిపికి ఉందన్నారు. ఎన్టీఆర్ 1994లో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా లేకుండా గెలిచారని, రానున్న ఎన్నికల్లో అదే పునరావృతమవుతుందన్నారు. కార్యకర్తల త్యాగాల వల్ల టిడిపికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. టిడిపిని దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు హయాంలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందన్నారు.
తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ప్రాణాలు అడ్డువేస్తామన్నారు. రౌడీయిజం చేసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని మండిపడ్డారు. పార్టీ నుండి ఒక్క నేత పోతే 50 మందిని తయారు చేసే సత్తా కలిగిన పార్టీ తెలుగుదేశం అన్నారు. తాను బిసి డిక్లరేషన్ పైన ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిస్తే రహస్యంగా కలిశారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.