జీవితం కూడా శాశ్వతం కాదు: కిరణ్ కుమార్ వేదాంతం!
జీవితం సహా ఏదీ శాశ్వతం కాదని, పదవి కోసం పరిగెత్తితే అది మనల్ని చూసి మరింత పరుగెత్తిస్తుందని, పదవులు కాదు.. సేవే ముఖ్యమని, సేవ చేస్తే పదవే మీ ఇంటి తలుపు తడుతుందని, పదవులు కాదు.. పదిమందికి ఉపయోగపడ్డామా లేదా అన్నదే ముఖ్యమని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ఓడించగలిగేవారు ఎవరూ లేరని, తమ వాళ్లు తప్ప అన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో విజయనగరం జిల్లా వాళ్లు చాలా తెలివైన వాళ్లని, తెలివిగా మాట్లాడుతారని పక్కనే ఉన్న బొత్సను చూసి చిరునవ్వు నవ్వారు.
గన్నవరంలోని ఎన్టీఆర్ పశు విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమష్టిగా కలసిమెలసి ఉండాలని, అప్పుడే అధికారంలోకి వస్తామని, మనకు మనమే శత్రువులమని, పార్టీని మనవాళ్లు తప్ప మరెవరూ ఓడించలేరన్నారు.
కాగా, ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామన్న తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అన్నట్టే కిరణ్కు అడుగడుగునా నిరసన తెలిపారు. ఉయ్యూరులో శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నిరసన తెలిపి అరెస్టయ్యారు. డెల్టాపై టిడిపి నేతలు, ఇసుక తరలింపుపై సిపిఎం శ్రేణులు గన్నవరం సభలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు.