బాబు లేఖపై శివాలెత్తిన కెసిఆర్: దగా అంటూ వ్యాఖ్య

శాసనసభలో తెలంగాణ తీర్మానానికి నిన్నటి దాకా తమ పార్టీ పట్టుబడితే తెలుగుదేశం పార్టీ ఎందుకు కలిసి రాలేదని ఆయన అడిగారు. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం జటిలం చేసిందని చంద్రబాబు అనడాన్ని ప్రస్తావిస్తూ జటిలం చేసింది చంద్రబాబేనని ఆయన అన్నారు. తన దీక్షతో కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు లేఖ ఓ జోక్, ఓ ఫార్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలను మాత్రమే కాకుండా తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలను సైతం చంద్రబాబు ఏమార్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్రం ప్రకటించిన తర్వాత యూ టర్న్ తీసుకుని తెలంగాణ అంశాన్ని చంద్రబాబే జటిలం చేశారని ఆయన అన్నారు.
తెలంగాణలో తన పాదయాత్రకు ఎంట్రీ పాస్ సంపాదించుకోవడానికి చంద్రబాబు చేసిన చిల్లర ప్రయత్నమే తాజా లేఖ అని తెరాస శానససభ్యుడు కెటి రామారావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాజా లేఖ తమకు అనుకూలంగా ఉందంటూ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చంకలు గుద్దుకుంటున్నారని ఆయన అన్నారు,
అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు అడగడం విడ్డూరమని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని సీమాంధ్ర నాయకులు దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, మోదుగుల, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, తదితరులతో చంద్రబాబు చెప్పిస్తారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications